Good News for Farmers: రైతులకు రేవంత్ రెడ్డి సర్కార్ శుభవార్త అందజేసింది. రాబోయే వారంలోనే పత్తి కొనుగోళ్లను ప్రారంభించేందుకు చర్యలు తీసుకున్నట్లు వ్యవసాయ శాఖ తెలిపింది. అందుకై వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు తన నివాసంలో సమీక్ష సమావేశం నిర్వహించారు.
ఈ నెల 6న మరోసారి చర్చ: ప్రస్తుతం కొనుగోలు ప్రక్రియ ఆలస్యం కావడంపై మంత్రి కీలక వ్యాఖ్యలు చేశారు. జిన్నింగ్ మిల్లులు సీసీఐ టెండర్లలో పాల్గొనకపోవడం వల్ల కొనుగోళ్ల ప్రక్రియలో సమస్యలు ఉత్పన్నం అయ్యాయని తెలిపారు. ఈ అంశాన్ని కేంద్ర ప్రభుత్వ దృష్టికి ఇప్పటికే తీసుకెళ్లామని తెలిపారు. ఇప్పటికే రెండు సార్లు సీసీఐ అధికారులు, మిల్లర్లతో సమావేశం నిర్వహించినట్లు మంత్రి చెప్పారు. పత్తి కొనుగోళ్ల అంశంపై ఈ నెల 6వ తేదీన సీసీఐ సీఎండీ, కాటన్ మిల్లర్ల సంఘం ప్రతినిధులతో మరోసారి సమావేశమవుతానని మంత్రి వెల్లడించారు.
Also Read:https://teluguprabha.net/telangana-news/revanth-reddy-govt-to-procure-paddy-from-farmers/
రైతుల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ఉపేక్షించం: అధిక వర్షాల కారణంగా పత్తి దిగుబడి ఆశించిన స్థాయిలో రాలేదని మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఈ నేపథ్యంలో అన్నదాతల ప్రయోజనాలకు విరుద్ధంగా ప్రవర్తిస్తే ప్రభుత్వం ఉపేక్షించదని మంత్రి హెచ్చరించారు. రాబోయే వారం రోజుల్లో ఎట్టి పరిస్థితుల్లోనూ పత్తి కొనుగోళ్లు ప్రారంభం కావాల్సిందేనని తుమ్మల స్పష్టం చేశారు.
గత సీజన్ విధానాలే కొనసాగింపు: గత సంవత్సరం అమలు చేసిన విధానాలను ఈ సీజన్లోనూ కొనసాగించాలని మిల్లర్లకు సూచించామని మంత్రి తుమ్మల తెలిపారు. లింట్ శాతం, ఎల్-1 స్లాట్ బుకింగ్ ఏరియా మ్యాపింగ్ వంటి అంశాలపై అభ్యంతరాలు వచ్చాయని అన్నారు. అయినప్పటికీ కొన్ని నిబంధనల్లో సడలింపులు ఇచ్చి.. మిగతావన్నీ యథాతథంగా అమలు చేస్తామని సీసీఐ అధికారులు హామీ ఇచ్చినట్లు తుమ్మల తెలిపారు.


