Friday, September 20, 2024
HomeతెలంగాణRevanth Reddy: ప్రజల్ని ప్రభుత్వం దగ్గరకు రప్పించకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తోంది

Revanth Reddy: ప్రజల్ని ప్రభుత్వం దగ్గరకు రప్పించకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్తోంది

ప్రజల వద్దకు ప్రభుత్వమే నడిచి వెళ్తోంది..

ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరకు వస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల వద్దకు నడిచి వెళ్తోందన్నారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి. సచివాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ప్రజాపాలన అభయహస్తం ఆరు గ్యారంటీల లోగో, పోస్టర్‌, దరఖాస్తు ఫారంను విడుదల చేశారు. సీఎంతో పాటు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, పలువురు మంత్రులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా రేవంత్‌ రెడ్డి మాట్లాడారు. ఇచ్చిన హామీలను నిలబెట్టుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ కృషి చేస్తోందని రేవంత్‌ రెడ్డి అన్నారు.

- Advertisement -

నిస్సహాయులకు సహాయం చేయడమే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు సీఎం రేవంత్ రెడ్డి. తండాలు, గూడాలలో ఉన్న అత్యంత నిరుపేదలకు పథకాలు అందించేందుకు గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్టు చెప్పారు. సచివాలయానికి, ప్రజాభవన్‌కు వచ్చి దరఖాస్తులు ఇవ్వడం కష్టమైన పని అన్నారు.
హైదరాబాద్ రావాల్సిన పని లేకుండా గ్రామాల్లోనే లబ్దిదారుల ఎంపిక నిర్వహించనున్నట్లు చెప్పారు. ప్రజల్ని ప్రభుత్వం దగ్గరకు రప్పించకుండా ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళుతోందన్నారు. ప్రజలకు ఇబ్బంది లేకుండా ప్రభుత్వాన్ని ప్రజల వద్దకు పంపుతున్నట్టు చెప్పారు. గ్రామ సభల్లో సర్పంచులు, ఎంపిటిసిలు, జడ్పిటీసీలు, మంత్రలు, ఎమ్మెల్యేలు ప్రజల వద్దకు ప్రభుత్వం భరోసా కల్పిస్తుందని చెప్పారు. ప్రజావాణి కార్యక్రమానికి రప్పించడం కాకుండా ప్రజల వద్దకే వెళ్లి గ్రామ సభలు ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు.

‘‘డిసెంబరు 28 నుంచి గ్రామాలు, పట్టణాలు, మున్సిపల్‌ వార్డుల్లో ఐదు పథకాలకు (మహాలక్ష్మి, రైతుభరోసా, గృహజ్యోతి, ఇందిరమ్మ ఇళ్లు, చేయూత) సంబంధించిన దరఖాస్తులను స్వీకరిస్తాం. ఎనిమిది పనిదినాల్లో గ్రామ సభల ద్వారా దరఖాస్తుల స్వీకరణ ఉంటుంది. డిసెంబర్ 7న ప్రమాణ స్వీకారం చేశాం. జనవరి 7లోపు లబ్ధిదారుల వివరాలు సేకరించేందుకు యత్నిస్తున్నాం. అర్హులైన లబ్ధిదారులకు పథకాలు అందించాలని నిర్ణయించాం. ప్రభుత్వమే ప్రజల వద్దకు వెళ్లి న్యాయం చేసేందుకు యత్నిస్తుంది. ప్రజాపాలన కార్యక్రమాన్ని ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది అన్నారు‘‘ రేవంత్ రెడ్డి.
గ్రామసభల దరఖాస్తుతో వివరాలు మాకు అందుతాయన్నారు రేవంత్ రెడ్డి. ఎన్ని రోజుల్లో పరిష్కారం చేయగలుగుతం అనేది తెలుస్తుందన్నారు. మంచి ఆలోచనతో చేస్తున్నామని తెలిపారు. ప్రతి మండలం రెండు గ్రూపులు ఉంటాయని, ఒక గ్రూప్ కి ఎండీఓ.. మరో గ్రూప్ కి ఎమ్మార్వో బాధ్యత వహిస్తారని చెప్పారు. త్వరలోనే రేషన్‌కార్డులు ఇస్తామన్నారు సీఎం రేవంత్ రెడ్డి. రేషన్‌కార్డులు ఉంటేనే సంక్షేమ పథకాలు అందుతాయి. అభయహస్తం దరఖాస్తు చేసుకునే వారికి రేషన్ కార్డు లేకపోయినా పరిగణలోకి తీసుకుంటామని స్పష్టం చేశారు. రేషన్ కార్డుల జారీ నిరంతర ప్రక్రియ అని రేవంత్ రెడ్డి అన్నారు.
గత పదేళ్లలో ప్రభుత్వం ప్రజలకు అందుబాటులో లేదని.. అందుకు ప్రజావాణీలో వచ్చిన 24 వేల ఫిర్యాదులే ఉదాహరణ అని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. తెలంగాణ ప్రజలు మోయలేని భారాన్ని గత పదేళ్లలో మోసారని అన్నారు. ఒకప్పుడు ప్రజలకు సమస్యలు ఉంటే ప్రభుత్వం దగ్గరకు వస్తే గడీలు అడ్డుగోడలుగా ఉండేవని, కానీ ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల వద్దకు నడిచి వెళ్తోందన్నారు. ప్రజా పాలనలో ప్రజలకు తమ మీద మరింత విశ్వాసం కలుగుతుందన్నారు. గతంలో గడీల మధ్య పాలనా నడిచిందని.. ఇప్పుడు ప్రభుత్వమే ప్రజల కోసం వారి వద్దకు వెళ్తుందన్నారు.

ప్రభుత్వం, అధికారులకు దగ్గరైనప్పుడు సమస్యలు పరిష్కారం అవుతాయి. గ్రామసభల్లో దరఖాస్తు పత్రాలు అందుబాటులో ఉంటాయి. అర్హులైన ప్రతీ ఒక్కరికి గ్యారంటీలను అందిస్తాం. మారుమూల పల్లెకూ సంక్షేమ పథకాలు అందాలన్నదే మా లక్ష్యం. ప్రభుత్వమే మీ దగ్గరకు వస్తుంది. ప్రతీ మండలంలో రెండు గ్రూపులు ఏర్పాటు చేస్తాం. మహిళలకు, పురుషులకు వేరువేరుగా కౌంటర్లు ఏర్పాటు చేయడం జరిగింది. గ్రామ సభలు ముగిసిన తరువాత కూడా దరఖాస్తులు స్వీకరిస్తామన్నారు. గడువు తరువాత దరఖాస్తులు స్వీకరించేలా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు సీఎం. ఎవరూ ఆందోళన చెందొద్దు.. ఈ ప్రభుత్వం ప్రజలది..ప్రజల కోసం పనిచేస్తుందన్నారు. జనవరి ఆరో తేదీ తర్వాత కూడా ఎంపీడీవో, ఎంఆర్‌వో ఆఫీసుల్లో అభయ హస్తం దరఖాస్తు చేసుకోవచ్చు అన్నారు.

ప్రజావాణిలో సమస్య పరిష్కారం కాలేదని ఓ మహిళ మాజీ మంత్రి కేటీఆర్‌ను కలిసినట్లు తెలిసింది. బాధిత మహిళకు ఆయన లక్ష సాయం అందించారు. కేటీఆర్‌ దోచుకున్న కోట్ల రూపాయల్లో బాధితురాలికి లక్ష ఇచ్చారు. కేటీఆర్ తన లక్ష కోట్ల దోపిడీలో లక్ష రూపాయలు సహాయం చేసేలా చేశామన్నారు. అధికారంలో ఉండగా కేటీఆర్ లక్ష కోట్ల రూపాయలను అవినీతిగా.. అక్రమంగా సంపాదించారని.. అందులో లక్ష రూపాయలు కక్కించామని.. లక్ష కోట్ల అవినీతి డబ్బులో లక్ష రుపాయలు చెల్లించడం సంతోషంగా ఉందని, కేటీఆర్‌ వద్ద మిగిలిన 99వేల 999కోట్ల రుపాయల 99లక్షలు ఉన్నాయని వాటిని కూడా పేదలకు పంచాల్సి ఉందన్నారు. ఆ పరిస్థితులు వస్తాయన్నారు సీఎం రేవంత్ రెడ్డి.

గత ప్రభుత్వ అవినీతిపై శ్వేతపత్రాలు విడుదల చేశాం. రూ. 6.71లక్షల కోట్లు అప్పులు చేసి నిండా ముంచారు. పరిస్థితుల నుంచి తేరుకుని ముందుకు వెళ్లేందుకు కృషి చేస్తున్నాం. కేంద్రం నుంచి రాష్ట్రానికి రావాల్సిన నిధులను రాబడతాం. కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత చూస్తే.. ఖాళీ కుండలే ఉన్నాయి.. కేసీఆర్ అండ్ ఫ్యామిలీ మొత్తం ఊడ్చుకుని వెళ్లింది అన్నారు. మేం లంకె బిందెలు అని వస్తే.. ఖాళీ గిన్నెలు కనిపిస్తున్నాయని.. ఇప్పుడు అంతా సెట్ రైట్ చేయాల్సిన పరిస్థితి వచ్చిందన్నారు. అందుకే మేం కేంద్రం దగ్గరకు వెళ్లామన్నారు. తెలంగాణకు సంబంధించి ఎక్కడి నుంచి రావాలో అవన్నీ తెస్తాం. కేంద్రం నుంచి రావాల్సిన నిధులను కూడా తెచ్చుకుంటామన్నారు రేవంత్ రెడ్డి.
పదేళ్లపాటు కేటీఆర్, హరీశ్ రావులు తిన్నది ప్రజల రక్తం కూడు అని ఆరోపించారు. ప్రజల రక్తమాంసాలతో రూ.1 లక్ష కోట్లు సంపాదించారన్నారు. ఉపయోగపడే భవనాలను కూల్చి కొత్తవి కట్టారు… అది ఆస్తి సృష్టించడం అని చెప్పుకుంటున్నారని విమర్శించారు. అసెంబ్లీలో కూడా బావాబావమరుదులు తప్ప మిగతా వారికి మాట్లాడే అవకాశం ఇవ్వలేదని విమర్శించారు. అసెంబ్లీలో చెప్పుకోవడానికి వారికి ఏ అంశమూ లేదని, అందుకే బయట చెబుతున్నారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్రంలో అనవసరపు ఖర్చులతో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారని సీఎం రేవంత్‌రెడ్డి మండిపడ్డారు. మూడో సారి గెలిస్తే తిరిగేందుకు కొత్తగా 22 క్రూయిజర్ కార్లు కొని దాచుకున్నారు.
‘‘ కాన్వాయ్ కోసం నేను కొత్త బండ్లు కొనను.. ఖర్చు పెట్టను అని ముందుగానే అధికారులకు చెప్పాను. పాతబండ్లనే రిపేర్ చేసి, అడ్జెస్ట్ చేసి ఇవ్వండి అని అధికారులకు చెప్పాను. అయితే.. నేను సీఎం అయిన10 రోజుల తర్వాత ఒక విషయం తెలిసింది. బీఆర్ఎస్ ప్రభుత్వం 22 కొత్త ల్యాండ్ క్రూజర్లు కొని దాచి పెట్టింది. ఈ విషయాన్ని ఓ అధికారి వచ్చి నాతో చెప్పాడు. కొత్త 22 ల్యాండ్ క్రూజర్లను విజయవాడలో దాచి పెట్టాం. కొత్త ప్రభుత్వం ప్రమాణ స్వీకారం చేయగానే మళ్లీ తీసుకొద్దామని అనుకున్నాం. కేసీఆర్ నెత్తిమీద దరిద్రం ఉండి ఆయన ఇంటికి పోయిండు’’ అని సదరు అధికారి తనతో చెప్పాడని తెలిపారు సీఎం రేవంత్ రెడ్డి.
అసలు ఇన్ని వందల వాహనాలు ఉన్నప్పుడు కొత్తవి అవసరమా..? అని ప్రశ్నించారు సీఎం రేవంత్ రెడ్డి. ఒక బండికి దాదాపు మూడు కోట్ల రూపాయల వరకు ఖర్చు అవుతుందని, బుల్లెట్ ప్రూఫ్ చేయిస్తే.. ఇంకొంచెం ఎక్కువ ఖర్చు అవుతుందన్నారు. ఇలాంటివి కేసీఆర్ సృష్టించిన సంపద అని చెప్పారు. 22 కొత్త ల్యాండ్ క్రూజర్ల వాహనాలు ప్రభుత్వ ఆస్తి.. తప్పనిసరిగా వాటిని తీసుకుంటామని స్పష్టం చేశారు. ఐటీఐఆర్ వెనక్కి వెళ్లిన, సైనిక్ స్కూల్ గురించి అడగని వినోద్ కుమార్ బుల్లెట్ ట్రైన్ గురించి మాకు నీతులు చెబుతారా? అని సీఎం ఎద్దేవా చేశారు.
రైతు బంధు పథకంపై వస్తున్న వార్తలపై స్పందించారు సీఎం రేవంత్ రెడ్డి. కేసీఆర్.. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలోనూ డిసెంబర్ 20వ తేదీ నుంచి మార్చి 30వ తేదీ వరకు విడదల వారీగా డబ్బులు జమ చేస్తూ వచ్చారని.. ఇప్పుడు ఎందుకు గాయ్ గాయ్ చేస్తున్నారంటూ కేటీఆర్, హరీశ్ లకు చురకలు అంటించారు. అర్హులైన ప్రతి రైతుకు రైతు బంధు పథకం డబ్బులు జమ అవుతాయని స్పష్టం చేశారు. గతంలో నాలుగు నెలలపాటు వేస్తూ వచ్చారని.. గత ఏడాది డిసెంబర్ 28వ తేదీన మొదలుపెట్టారని.. ఇప్పుడు డిసెంబర్ 20వ తేదీ నుంచి నిధుల జమ చేస్తూ వస్తున్నట్లు వివరించారు. . రైతు బంధు సీలింగ్ పైన చర్చ జరుగుతున్న వేళ క్లారిటీ ఇచ్చారు. రైతు బంధుకు సంబంధించి ఇప్పటివరకు ఎలాంటి పరిమితి విధించలేదన్నారు సీఎం రేవంత్ రెడ్డి. సీలింగ్ పైన అసెంబ్లీలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
ఉద్యోగాల భర్తీ విషయంలో నిరుద్యోగులు ఆందోళన చెందవద్దు అన్నారు సీఎం రేవంత్ రెడ్డి. గ్రూప్-2 నిర్వహణలో త్వరలోనే నిర్ణయం తీసుకుంటమన్నారు. టీఎస్‌పీఎస్సీ ఛైర్మన్‌ లేకుండా పరీక్షల ప్రక్రియ జరగదు. టీఎస్‌పీఎస్సీ సభ్యులు ఇప్పటికే రాజీనామాలు సమర్పించారు. గవర్నర్ నిర్ణయం తీసుకున్న వెంటనే కొత్త కమిషన్ ఏర్పాటు చేస్తామన్నారు. ఇచ్చిన మాట ప్రకారం జాబ్ కాలెండర్ మేరకు ఏడాదిలోగా రెండు లక్షల ఉద్యోగాలను భర్తీ చేస్తామన్నారు. ఏడాదిలోగా నోటిఫికేషన్లు విడుదల, రిక్రూట్‌మెంట్ ప్రక్రియ భర్తీ చేస్తామని నిరుద్యోగులకు సీఎం భరోసానిచ్చారు.

మేడిగడ్డకు సంబంధించి న్యాయ విచారణ జరుగుతోంది. విచారణ తర్వాత ఎల్‌ అండ్‌ టీ, అధికారుల పాత్ర ఏమిటనేది తేలుతుంది. మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం విజయవంతమైంది. ఉచిత బస్సు ప్రయాణంతో ఆటో డ్రైవర్ల పరిస్థితిని ముందే ఊహించాం. ఆటో డ్రైవర్లకు ఆర్థిక సాయం అందజేసి ఆదుకుంటాం. నిధులు దుర్వినియోగం కాకుండా చూస్తే పథకాలకు ఉపయోగపడుతుందని రేవంత్ రెడ్డి తెలిపారు. ఒకప్పుడు సచివాలయం అంటే ఏదో తెలియదని, సచివాలయం లోపల మీడియా సమావేశం ఉంటుందని ఎవరైనా ఊహించారా అని అడిగారు. ఇక మీదట సెక్రటేరియెట్‌లో మీడియా సెంటర్ ఉంటుందన్నారు. మంత్రులు, అధికారులు అందుబాటులో ఉంటారని తెలిపారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News