Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ఎన్నికల ప్రచారంలో భారతీయ జనతా పార్టీ (BJP) , భారత రాష్ట్ర సమితి (BRS)పై తీవ్ర స్థాయిలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విరుచుకుపడ్డారు. కాంగ్రెస్ అభ్యర్థి నవీన్ యాదవ్కు మద్దతుగా షేక్పేట్లో నిర్వహించిన బహిరంగ సభలో పాల్గొన్న సీఎం, ప్రతిపక్షాలపై సవాళ్లు విసిరారు.
“జూబ్లీహిల్స్లో బీజేపీ అభ్యర్థులు ఏకంగా భారత రాష్ట్ర సమితి పేరుతో ఓట్లు అడుగుతున్నారు. దీనిని బట్టే మోదీ, కేసీఆర్లు తెరవెనుక ఒక్కటేనని స్పష్టమవుతోంది. ముఖ్యంగా ముస్లిం మైనారిటీలను బీఆర్ఎస్ మోసం చేస్తోంది,” అని రేవంత్ రెడ్డి ధ్వజమెత్తారు. తమ ప్రభుత్వం ఇప్పటికే జూబ్లీహిల్స్లో రూ. 400 కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టిందని, అదనంగా 4 వేల ఇందిరమ్మ ఇళ్లు నిర్మిస్తామని సీఎం హామీ ఇచ్చారు. నవీన్ యాదవ్ను గెలిపిస్తే మరిన్ని అభివృద్ధి పనులు చేపడతామన్నారు.
కిషన్రెడ్డికి సవాల్:
“హైదరాబాద్లో మూసీ రివర్ ఫ్రంట్ ఎందుకు కట్టకూడదో కేంద్ర మంత్రి కిషన్రెడ్డి సమాధానం చెప్పాలి. నేను సవాల్ విసిరితే ఎందుకు స్పందించడం లేదు?” అని ప్రశ్నించారు. అజారుద్దీన్కు మంత్రి పదవి ఇవ్వడంపై కిషన్రెడ్డి చేసిన వ్యాఖ్యలను సీఎం తీవ్రంగా ఖండించారు. “అజారుద్దీన్కు మంత్రి పదవి ఇస్తే కిషన్రెడ్డికి ఏం ఇబ్బంది? ఎందుకు ఇవ్వకూడదో ఆయనే చెప్పాలి,” అని నిలదీశారు.
ముస్లిం మైనారిటీల మద్దతు:
తాను మొదటి నుంచి సెక్యులర్ భావాలు ఉన్న వ్యక్తిని అని స్పష్టం చేసిన సీఎం, కాంగ్రెస్ పాలనలో మైనారిటీలకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూశామన్నారు. కొడంగల్లో తాను మూడు సార్లు గెలవడానికి మైనారిటీల సహకారమే కారణమని గుర్తు చేశారు.కేటీఆర్కు సవాల్ విసిరి పారిపోవడం అలవాటుగా మారిందని విమర్శించిన రేవంత్ రెడ్డి, “కేసీఆర్ పదేళ్ల పాలనలో మహిళలకు ఉచిత బస్సు ప్రయాణ సౌకర్యం ఎందుకు కల్పించలేదు?” అని సూటిగా ప్రశ్నించారు.


