Seethakka: సిరిసిల్ల జిల్లా నేరెళ్ల గ్రామంలో ఇస్కాన్ ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తున్న ఆధ్యాత్మిక, సామాజిక సేవా ప్రాజెక్టుకు రహదారి సదుపాయం కల్పించనున్నట్లు పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్క హామీ ఇచ్చారు. శుక్రవారం ప్రజాభవన్లో మంత్రి సీతక్కను ఇస్కాన్ ప్రతినిధులు కలిసి.. 18 ఎకరాల్లో చేపట్టిన ప్రాజెక్టుకు రహదారి ఏర్పాటు చేయాలని కోరారు. గోశాల, అన్నదాన సత్రం, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల శిక్షణ, సోలార్ విద్యుత్, సాలిడ్ వెస్ట్ మేనేజ్మెంట్తోపాటు ఆధ్యాత్మిక కార్యక్రమాలు చేపట్టనున్నట్లు ప్రతినిధులు వివరించారు. రహదారి నిర్మాణ ప్రతిపాదనలు వెంటనే సిద్ధం చేసి పంపాలని పంచాయతీరాజ్ ఈఎన్సీకి మంత్రి సీతక్క ఆదేశాలు జారీ చేశారు.
సుప్రీం తీర్పుతో నష్టపోతున్నాం : నీట్ విద్యార్థులు
మంచి ర్యాంకులు సాధించినప్పటికీ సుప్రీంకోర్టు తీర్పు కారణంగా కౌన్సెలింగ్కు హాజరు కాలేకపోతున్నామని ప్రజా భవన్లో మంత్రి సీతక్కను నీట్ అర్హత సాధించిన విద్యార్థులు, తల్లిదండ్రులు కలిశారు. తెలంగాణ ప్రాంతానికి చెందిన వారే అయినప్పటికీ ఇంటర్ పొరుగు రాష్ట్రాల్లో చదివిన కారణంగా అన్యాయం జరుగుతోందని విద్యార్థులు మంత్రి దృష్టికి తీసుకొచ్చారు. ఈ అంశాన్ని మంత్రి, సీఎం రేవంత్రెడ్డి దృష్టికి తీసుకెళ్తానని సీతక్క హామీ ఇచ్చారు.
ఇన్ఫోసిస్ ఫౌండేషన్ను అభినందించిన మంత్రి
కామారెడ్డి వరద బాధితుల కోసం ఇన్ఫోసిస్ ఫౌండేషన్ ముందుకొచ్చింది. రూ.15 లక్షల విలువైన 495 నిత్యావసర కిట్లను పంపిణీ చేయడానికి సిద్ధమైన ఫౌండేషన్ చర్యలను మంత్రి సీతక్క ప్రశంసించారు. మంత్రిని ఫౌండేషన్ ప్రతినిధులు వంశీ, వినోద్ కలిశారు. ములుగులో రూ.20 లక్షల విలువైన 634 నిత్యావసర కిట్లను త్వరలో పంపిణీ చేయనున్నట్లు వారు తెలిపారు.


