ప్రజా యుద్ధనౌక, విప్లవ కవి గద్దర్ కు తొలి నుంచి కాంగ్రెస్ ప్రభుత్వం సరైన గుర్తింపు ఇస్తూనే ఉన్న సంగతి తెలిసిందే. ముఖ్యంగా సీఎం రేవంత్ రెడ్డి అయితే గద్దర్ సేవలను నిరంతరం స్మరించుకుంటూనే ఉంటారు. 11 సంవత్సరాల తర్వాత తెలుగు సినీ ఇండస్ట్రీకి ఇచ్చే అవార్డులకు గద్దర్ ఫిల్మ్ అవార్డ్స్ అని పేరు పెట్టి ఆయనను గౌరవించుకున్నారు. తాజాగా గద్దర్ ఫౌండేషన్(Gaddar Foundation)కు ప్రభుత్వం తరపున రూ.3కోట్లు మంజూరు చేశారు. ఇటీవల గద్దర్ జయంతి వేడుకల్లో పాల్గొన్న సీఎం.. ఫౌండేషన్కు అవసరమైన నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ మేరకు నిధులు మంజూరు చేస్తూ తాజాగా రాష్ట్ర భాషా, సాంస్కృతిక శాఖ ఉత్తర్వులు జారీ చేసింది.
గద్దర్ భావజాలాన్ని పరిరక్షించడం, ఆయన ఆలోచనలు, సాంస్కృతిక ప్రభావంపై పరిశోధనలను ప్రోత్సహించడం ప్రభుత్వ లక్ష్యమని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. అలాగే గద్దర్ జయంతి వేడుకల కార్యక్రమాల నిర్వహణలోనూ గద్దర్ ఫౌండేషన్కు భాగస్వామ్యం కల్పించింది. ఈ నిధులను గద్దర్ ఫౌండేషన్ చేపట్టే వివిధ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. కాగా తెలంగాణ ఉద్యమం, సాంస్కృతిక రంగంపై తనదైన ముద్ర వేసిన గద్దర్ సేవలకు గుర్తింపుగా ఆయన జయంతిని రాష్ట్ర ప్రభుత్వం అధికారికంగా జరుపుతున్న సంగతి తెలిసిందే. మరోవైపు హైదరాబాద్ నెక్లెస్ రోడ్డులో గద్దర్ స్మారక చిహ్నం ఏర్పాటుకు ప్రభుత్వం చర్యలు చేపట్టింది.
తెలంగాణ ఉద్యమంలో గద్దర్ పాడిన ప్రజల్లో ఎంతో ఉద్యమ స్ఫూర్తి రగిలించాయి. తన పాటలు, ప్రసంగాల ద్వారా సామాజిక సమస్యలపై ప్రజల్లో చైతన్యం నింపారు. తన జీవితాంతం కుల వివక్ష, బడుగుబలహీన వర్గాల సమస్యలపై తన గళాన్ని బలంగా వినిపించారు. 2023 ఆగస్టులో అనారోగ్యం కారణంగా ఆయన ఈ లోకాన్ని విడిచి వెళ్లిపోయారు. కాగా ఆయన జ్ఞాపకార్థం తెలుగు సినీ ఇండస్ట్రీకి గద్దర్ ఫిల్మ్ అవార్డులను ప్రభుత్వం అందిస్తుంది. ఇప్పటికే అవార్డును కూడా ప్రకటించిన విషయం విధితమే. ఈ అవార్డులను అవార్డ్ గ్రహీతలకు సీఎం రేవంత్ రెడ్డి జూన్ 14న సాయంత్రం అందించనున్నారు. ఈ వేడుకను అంగరంగం వైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది.