CM Revanth Reddy: యాదవులకు రాజకీయాల్లో సముచిత స్థానం కల్పిస్తామని సీఎం రేవంత్ రెడ్డి హామీ ఇచ్చారు. ఆదివారం ఇందిరాపార్కు ధర్నాచౌక్లో శ్రీ కృష్ణ సదర్ సమ్మేళనం ఆధ్వర్యంలో ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ నేతృత్వంలో ఘనంగా నిర్వహించిన సదర్ వేడుకలకు ముఖ్య అతిథిగా రేవంత్ రెడ్డి హాజరయ్యారు.
యాదవుల పాత్ర అత్యంత కీలకం: హైదరాబాద్ కా సదర్.. యాదవుల ఖదర్ అని సీఎం పేర్కొన్నారు. కులీకుతుబ్షాల కాలం నుంచి యాదవులపై నమ్మకం, విశ్వాసం ఉందని అన్నారు. నమ్మిన వారి కోసం ఏదైనా చేసే తెగువ యాదవులకు ఉందని కొనియాడారు. యాదవులు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వ దృష్టికి తీసుకొస్తే పరిష్కరించేందుకు తనవంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటులో యాదవుల పాత్ర అత్యంత కీలకమని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు.
సదర్ను రాష్ట్ర పండుగగా గుర్తింపు: కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే సదర్ను రాష్ట్ర పండుగగా గుర్తించి ప్రత్యేక నిధులు మంజూరు చేస్తున్నట్టు సీఎం రేవంత్ రెడ్డి ప్రకటించారు. ఈ సందర్భంగా శ్రీకృష్ణ భగవానుడికి, దున్నపోతులకు ప్రత్యేక పూజలు నిర్వహించి ఉత్సవాలను ఆయన ప్రారంభించారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత యాదవులకు సముచిత స్థానం లభించిందని ఎంపీ అనిల్ కుమార్ యాదవ్ సంతోషం వ్యక్తం చేశారు. ఈ వేడుకలకు మంత్రులు పొంగులేటి శ్రీనివాస్రెడ్డి, పొన్నం ప్రభాకర్, వాకిటి శ్రీహరి, వివేక్ వెంకటస్వామి, మాజీ గవర్నర్ బండారు దత్తాత్రేయ, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్ రాంచందర్ రావు, ప్రభుత్వ సలహాదారు వేం నరేందర్ రెడ్డి, మాజీ ఎంపీ అంజన్ కుమార్ యాదవ్, మాజీ మంత్రి సి.కృష్ణాయాదవ్, మాజీ ఎమ్మెల్యే మైనంపల్లి హనుమంతరావు తదితరులు హాజరయ్యారు.
అలరించిన కళారూపాల విన్యాసాలు: సదర్ సందర్భంగా ఏర్పాటు చేసిన డప్పుడోలు, కోలాటం, బోనాలు వంటి కళారూపాలు ఆకట్టుకున్నాయి. జంటనగరాల నుంచి యాదవులు తమ దున్నపోతులను అందంగా అలంకరించి వాటితో చేయించిన విన్యాసాలు అలరించాయి.


