Friday, September 20, 2024
HomeతెలంగాణSathyavathi Rathod: గిరిజనులను కేంద్రం చిన్నచూపు చూస్తుంది

Sathyavathi Rathod: గిరిజనులను కేంద్రం చిన్నచూపు చూస్తుంది

గిరిజనులను కేంద్రం చిన్నచూపు చూస్తుందని రాష్ట్ర గిరిజన, స్త్రీ, శిశు సంక్షేమశాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌ పాలనే ఆదివాసీ, గిరిజనులకు స్వర్ణ యుగమని, మేలు చేసిన సీఎం కేసీఆర్‌ను గిరిజన జాతి మరువబోదని స్పష్టం చేశారు. ఈ మేరకు ఆదివారం ఖైరతాబాద్‌లోని విశ్వేశ్వరయ్య భవన్‌లో జరిగిన జాతీయ బంజారా మీట్ 2023 కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరై మాట్లాడుతూ గిరిజనుల పక్షపతి సీఎం కేసీఆర్ అని, రాష్ట్రంలో సీఎం కేసీఆర్‌ పాలన దేశానికే ఆదర్శం అన్నారు. గిరిజనులపై బిజెపిది కపట ప్రేమ, బిజెపి గిరిజనుల కోసం ఏం చేసిందో చెప్పాలన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఎస్టీలు మాట్లాడి గోర్ మాటి భాషను 8వ షెడ్యూల్లో చేర్చాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక గిరిజన గురుకులాలు, బంజారా భవన్ ఏర్పాటు చేసుకుంటున్నామన్నారు. గిరిజన అభివృద్ధి కోసం అన్ని పార్టీల్లో ఉన్న నేతలు కృషి చేస్తామన్నారు. కేంద్ర ప్రభుత్వం నిర్మాణం చేసిన పార్లమెంటు స్థలం బంజారా బిడ్డదని అన్నారు. హైదరాబాదులో ఎంతో ప్రతిష్టాత్మకంగా బంజారా భవన్ ను ఏర్పాటు చేసుకున్నామని చెప్పారు. ఢిల్లీలో కూడా సేవాలాల్ భవన్ నిర్మాణం చేయాలన్నారు. సేవాలాల్ జయంతిని దేశవ్యాప్తంగా అధికారికంగా జరిపించాలన్నారు. తెలంగాణ రాష్ట్రంలో గిరిజనుల అభివృద్ధి చెందినట్లు దేశవ్యాప్తంగా అభివృద్ధి జరగాలన్నారు.వచ్చే నెలలో పోడు భూములు పట్టాలు అందిస్తుట్లు తెలిపారు.తెలంగాణలో 3,144 తండాలను గ్రామ పంచాయతీలుగా చేయడంతో పాటు, రూ.2వేల కోట్లతో గిరిజన ఆవాసాలకు రోడ్లు వేయించిన ఘనత గౌరవ సీఎం కేసీఆర్‌కే దక్కుతుందన్నారు. గిరిజనులకు 10శాతం రిజర్వేషన్ల అమలుతో విద్య ఉద్యోగ అవకాశాలు పెరిగాయని తెలిపారు. వీటితో పాటు మెడికల్‌, ఇంజినీరింగ్‌ సీట్లు అదనంగా వచ్చాయన్నారు. కేంద్ర ప్రభుత్వం గిరిజనులకు 10శాతం రిజర్వేషన్‌ పెంచడానికి ఎందుకు జాప్యం చేస్తున్నదని ప్రశ్నించారు. గిరిజనులపై కేంద్రానికి ప్రేమ ఉంటే తెలంగాణ మాదిరిగా వెంటనే దేశంలో 10శాతం రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్‌ చేశారు. ప్రతి తండాకు గుడి కట్టిస్తామని చెబుతున్న బీజేపీ నాయకులు హైదరాబాద్‌లో సీఎం కేసీఆర్‌ కట్టించిన మాదిరి ఢిల్లీలో బంజారా భవన్‌ను నిర్మించి, సేవాలాల్‌ జయంత్యుత్సవాలను దేశ వ్యాప్తంగా అధికారికంగా నిర్వహించే దమ్ము ఉందా అని సవాల్‌ విసిరారు. దేశంలో 14కోట్ల మంది గిరిజనులు మాట్లాడుతున్న లంబాడి భాషను ఎనిమిదో షెడ్యూల్‌లో చేర్చి అధికారిక భాషగా కేంద్రం గుర్తించాలన్నారు. గిరిజనులపై కేంద్రానికి ప్రేమ ఉంటే ముఖ్యమంత్రి కేసీఆర్‌ తీసుకొన్న నిర్ణయాన్ని స్వాగతించి తన చిత్తశుద్ధిని చాటుకోవాలని అన్నారు. గిరిజనులపై బిజెపిది కపట ప్రేమ అని మండిపడ్డారు. బిజెపి గిరిజనుల కోసం ఏం చేసిందో చెప్పాలని మంత్రి సవాల్ విసిరారు. బంజారా మేధావులు, సామాజిక సంస్థల నాయకులు, ప్రొఫెసర్‌లు, అధికారులు, యువజన సంఘాల నాయకులు, 15 రాష్ట్రాల ప్రతినిధులు, డాక్టర్ బి.రమణ నాయక్ అధ్యక్షతన, డాక్టర్ ఎం.ధనంజయ్ నాయక్ పర్యవేక్షణలో జరిగిన సభలో దేశం అంతటా నివసిస్తున్న బంజారాల సమస్యలపై సమావేశంలో సుదీర్ఘమైన, వివరణాత్మక చర్చల అనంతరం పలు తీర్మానాలను ఆమోదించారు. రాజ్యాంగంలోని 8వ షెడ్యూల్‌లో బంజారా భాష చేర్చాలన్నారు. భారతదేశం అంతటా నివసిస్తున్న బంజారాలను గిరిజనులుగా గుర్తించి ఎస్టి రిజర్వేషన్లను వర్తింపచేయాలన్నారు. పార్లమెంటు ప్రాంగణంలో న్యూఢిల్లీలో బంజారా భవన్‌ను నిర్మించి, బాబా లఖిషా బంజారా పేరు మీదుగా నామకరణం చేయాలన్నారు. పార్లమెంట్ ప్రాంగణంలో బాబా లఖిషా బంజారా విగ్రహం ఏర్పాటు చేయాలన్నారు. దేశంలోని బంజారా తాండాల అభివృద్ధికి న్యూఢిల్లీలో ప్రధాన కార్యాలయంతో నేషనల్ తాండా డెవలప్‌మెంట్ కార్పోరేషన్ ఏర్పాటు చేయాలన్నారు.దేశం అంతటా తాండాలను రెవెన్యూ గ్రామాలు మరియు గ్రామపంచాయతిలుగా ప్రకటించాలన్నారు. దేశంలోని ఎస్టిలకు 80 శాతం రిజర్వేషన్లతో ఏపీ పునర్వ్యవస్థీకరణ చట్టం,2014 ప్రకారం తెలంగాణ రాష్ట్రంలో సెంట్రల్ ట్రైబల్ యూనివర్శిటీని తక్షణమే ఏర్పాటు చేయాలన్నారు. విద్యా ఉద్యోగాలలో ప్రైవేట్ రంగంలో రిజర్వేషన్ల అమలు చేయాలన్నారు. అన్ని రాష్ట్రాలలో బంజారాలు సాగుచేసే భూములపై ​​ప్రభుత్వ పట్టాలను అందచేయాలన్నారు. రెవెన్యూ, అటవీ, పోలీసు అధికారుల వేధింపుల నుండి బంజారాలకు రక్షణ కల్పించాలన్నారు. అన్ని రాష్ట్ర ప్రధాన కార్యాలయాలలో ఎస్టి కమీషన్లను ఏర్పాటు చేయాలన్నారు. జాతీయ ఎస్టి కమిషన్‌లో వెంటనే సభ్యుల నియామకం చేయాలన్నారు. హైకోర్టులు, సుప్రీంకోర్టు నియామకాలలో బంజారా న్యాయవాదులకు ప్రాధాన్యత రిజర్వేషన్ కల్పించాలన్నారు. బంజారా పిల్లలకు కేజీ నుండి పీజీ వరకు ఉచిత విద్య అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో ట్రై కార్ చైర్మన్ రామచంద్రునాయక్, జీసీసీ చైర్మన్ వాల్యానాయక్, మాజీ ఎంపీ సీతారాం నాయక్, అఖిలభారత బంజారా జాయింట్ యాక్షన్ కమిటీ ప్రెసిడెంట్ సింపల్ బాయ్ రాథోడ్, రాష్ట్ర ఆర్గనైజింగ్ కమిటీ చైర్మన్ ప్రొఫెసర్ డా. బి.రమణ నాయక్, కో-ఛైర్మన్ రాంబాల్ నాయక్, కో-ఆర్డినేటర్లు, డా.ఎం. ధనంజయ్ నాయక్, కో-ఆర్డినేటర్ రాంబాబు నాయక్, రూపసింగ్, ధరావత్ అభిమాన్ గాంధీ నాయక్, జి.తిరుపతి నాయక్, రవితేజ తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News