Thursday, July 4, 2024
HomeతెలంగాణSathyavathi Rathod: పరిస్థితి అదుపులో ఉంది, ఆందోళన వద్దు

Sathyavathi Rathod: పరిస్థితి అదుపులో ఉంది, ఆందోళన వద్దు

జాగ్రత్తగా ఉండండి, బెదిరిపోకండి-మంత్రి

భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో వాగులు పొంగిపొర్లుతున్న దృష్ట్యా అధికార యంత్రాంగం యావత్తు అప్రమత్తంగా ఉందని, పరిస్థితి పూర్తిగా అదుపులో ఉందని ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని రాష్ట్ర గిరిజన, స్త్రీ – శిశు సంక్షేమ శాఖల మంత్రి సత్యవతి రాథోడ్ అన్నారు. మహబూబాబాద్ జిల్లాలో గత రెండు రోజులుగా ఏడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు నదులు, వాగులు వంకలు ఉప్పొంగి ప్రవహిస్తున్నందున మంత్రి సందర్శించి పరిశీలించారు.

- Advertisement -


ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ మహబూబాబాద్ మున్సిపల్ పరిధిలోని జమాండ్లపల్లి వద్ద మున్నేరు వాగు ఉధృతి తగ్గుముఖం పట్టిందన్నారు. నెల్లికుదురు మండలంలోని వావిలాల, రావిరాల రహదారుల మీదుగా ప్రవహిస్తున్న వరద కూడా తగ్గిందన్నారు.నెల్లికుదురు, తొర్రుర్ మండలాల మధ్య కాచికల్ , మడిపల్లి గ్రామాల మధ్య ప్రవహిస్తున్న ఆకేరు వాగు వరద ప్రవాహాన్ని మంత్రి జిల్లా కలెక్టర్, ఎస్పీ అధికారుల తో కలిసి పరిశీలించారు. వర్షాల వల్ల ఎలాంటి పరిస్థితి ఉత్పన్నమైనా, సమర్ధవంతంగా ఎదుర్కొనేలా అన్ని శాఖల అధికారులు, సిబ్బందిని సమాయత్తం చేశామని అన్నారు. ఆయా శాఖల అధికారులు, సిబ్బంది అందరూ తమ తమ కార్య స్థానాల్లోనే అందుబాటులో ఉంటూ క్షేత్రస్థాయిలో పరిస్థితిని ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారని మంత్రి పేర్కొన్నారు. ప్రజలకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టడానికి అధికారులు సిద్ధంగా ఉన్నారని తెలిపారు. ఎలాంటి ఆస్తి నష్టం, ప్రాణ నష్టం జరగకుండా అధికారులకు క్షేత్ర స్థాయిలో పర్యవేక్షిస్తున్నారని తెలిపారు.


శిథిలావస్థ ఇండ్లలో ఎవరు ఉండకూడదని, వారి కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నాం అన్నారు. అన్ని పీ.హెచ్.సీలలో 24 గంటల పాటు వైద్య సేవలు అందుబాటులో ఉండేలా, అన్ని రకాల మందుల నిల్వలు ఉండేలా జాగ్రత్తలు తీసుకున్నామని, గర్భిణీలను సైతం పిహెచ్ సి లకు తరలించే విధంగా ఏర్పాటు చేశామన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అధికారుల సూచనలు పాటించాలన్నారు.చెరువులు, వాగులు, కుంటల వద్దకు మత్యకారులు, వ్యవసాయ కూలీలు వెళ్లవద్దని హితవు పలికారు. చెరువులు పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరుకున్నాయని తెలిపారు.


వర్షాలతో చెరువులు, కుంటలు జలకళను సంతరించుకోగా, భూగర్భ జలాలు పెరిగాయని, బోర్లలో నీటి నిల్వలు పెరిగాయని పేర్కొన్నారు.
ఈ కార్యక్రమంలో నీటిపారుదల శాఖల అధికారులు వెంకటేశ్వర్లు, సమ్మిరెడ్డి నారాయణ, నెల్లికుదురు తాసిల్దార్ యోగేశ్వరరావు, నర్సింహులపేట తహసిల్దార్ వివేక్,ఇతర అధికారులు, ప్రజాప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News