కాంగ్రెస్(Congress) పార్టీలో హద్దు దాటిన ప్రవర్తిస్తున్న నేతలపై అధిష్టానం చర్యలు తీసుకుంటుంది. పార్టీ లైన్ దాటి మాట్లాడుతున్న వారికి గట్టి హెచ్చరికలు ఇస్తోంది. ఇప్పటికే పార్టీ నేతలపై అనుచిత వ్యాఖ్యలతో పాటు ప్రభుత్వానికి వ్యతిరేకంగా వ్యవహరించిన ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్నను సస్పెండ్ చేసిన విషయం తెలిసిందే. తాజాగా మరో నేతకు షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఇటీవల మంత్రి సీతక్కపై సిర్పూర్ కాగజ్నగర్ కాంగ్రెస్ ఇంఛార్జ్ రావి శ్రీనివాస్ (Raavi Srinivas) పలు విమర్శలు చేశారు. దీంతో ఆయనపై స్థానిక నేతలు క్రమశిక్షణ కమిటీకి ఫిర్యాదు చేశారు. ఈ ఫిర్యాదుల నేపథ్యంలో పార్టీ క్రమశిక్షణ కమిటీ రావి శ్రీనివాస్కి షోకాజ్ నోటీసులు పంపించింది.
“క్రమశిక్షణా కార్యాచరణ కమిటీ, TPCC, మీ పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు సంబంధించి కాంగ్రెస్ కార్యకర్తల నుంచి ఫిర్యాదులను అందుకుంది. మీరు మీడియా సమావేశంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రిని విమర్శించారు. అంతేకాకుండా ఇటీవల జరిగిన గ్రాడ్యుయేట్ MLC ఎన్నికల్లో పార్టీ అభ్యర్థికి వ్యతిరేకంగా పనిచేశారు. DCC నాయకత్వంపై తీవ్ర వ్యాఖ్యలు చేశారు. మీరు పార్టీ కార్యక్రమాల్లో పాల్గొనలేదు. పైన పేర్కొన్న వాటిని దృష్టిలో ఉంచుకుని క్రమశిక్షణ కమిటీ మీకు షోకాజ్ నోటీసులు అందజేయాలని నిర్ణయించింది. ఈ షోకాజ్ నోటీసు తేదీ నుండి వారంలోపు మీ వివరణను 2025 మార్చి 28న లేదా అంతకుముందు సమర్పించాలి. లేకుంటే మీరు ఎటువంటి వివరణ ఇవ్వలేరని భావించబడుతుంది. కాంగ్రెస్ పార్టీ నిబంధనలు, విధానం ప్రకారం మీపై కఠినమైన చర్యలు తీసుకుంటాము” అని నోటీసుల్లో పేర్కొంది.