Saturday, September 28, 2024
HomeతెలంగాణSingareni: అధికారులతో సిఎండి శ్రీధర్ సమీక్ష

Singareni: అధికారులతో సిఎండి శ్రీధర్ సమీక్ష

రోజుకు 14 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ తొలగించాలి

తెలంగాణ, ఇతర రాష్ట్రల సింగరేణి సంస్థలోని అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లతో హైదరాబాద్ సింగరేణి భవన్ లో సంస్థ డైరెక్టర్లు, అడ్వైజర్లు, ఏరియాల జనరల్ మేనేజర్లతో బొగ్గు ఉత్పత్తి, రవాణాపై ప్రత్యేక సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్బంగా అయన మాట్లాడుతూ… వర్షాలు వల్ల బొగ్గు ఉత్పత్తి నిలిచిపోకుండా తగు ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి, తెలంగాణ ఇతర రాష్ట్రాలలో గల థర్మల్ విద్యుత్ కేంద్రాలకు బొగ్గు సరఫరాలో ఎటువంటి ఆటంకం లేకుండా ఏరియాల వారీగా పటిష్టమైన చర్యలు తీసుకోవాలి, ఓపెన్ కాస్ట్ గనుల్లో నిలిచిన నీటిని తోడి బయటకు పంపించడానికి ఇంకా అవసరమైతే మరిన్ని పంపులను ముందస్తుగానే ఏర్పాటు చేసుకోవాలి, వర్షం వెలిసిన కొద్ది గంటల్లోనే తిరిగి ఉత్పత్తి ప్రారంభించడానికి సంసిద్ధమై ఉండాలని సూచించారు.
ఆగస్టు నెలలో రోజుకు కనీసం 1.90 లక్షల టన్నుల బొగ్గు ఉత్పత్తి, 1.95 లక్షల టన్నుల బొగ్గు రవాణా జరపాలని, రోజుకు కనీసం 14 లక్షల క్యూబిక్‌ మీటర్ల ఓవర్‌ బర్డెన్‌ తొలగించాలని, అందుకు ప్రణాళికబద్ధంగా తగు చర్యలు చేపట్టాలని, వర్షాల తీవ్రతలో కూడా థర్మల్ విద్యుత్ కేంద్రాలలో విద్యుత్‌ ఉత్పత్తి నిరాటంకంగా సాగేందుకు సింగరేణి నుంచి బొగ్గు సరఫరా చేయటం కోసం కనీసం ఒక శాతం బొగ్గు అనగా ఐదు లక్షల టన్నుల బొగ్గును స్టాక్ గా ఉంచుకోవాలని ఆదేశించారు. ఏరియాల వారీగా అవసరమై ఉన్న కొత్త యంత్రాలను తక్షణమే సమకూర్చాలని, ఉత్పత్తికి సంబంధించిన అన్ని సమస్యలని తక్షణమే పరిష్కరించాలని ఆయన డైరెక్టర్ లకు సూచించారు. అన్ని ఏరియాలోని ఓపెన్ కాస్ట్ గనులకు సంబంధించి ఓవర్ బర్డెన్ తొలగింపు కాంట్రాక్టులను ఇప్పటికే ఖరారు చేసి ఉంచామని, ఆయా కాంట్రాక్టర్లతో నిర్దేశిత లక్ష్యాలు మేర ఓవర్ బర్డెన్ తొలగింపుకు ఏరియాల జీఏం లు ప్రత్యేక చొరవ చూపాలన్నారు. ఓవర్‌ బర్డెన్ లక్ష్యాల సాధనలో విఫలమవుతున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని, అడ్రియాల లాంగ్ వాల్ భూగర్భ గనిలో తరచూ సమస్యలు ఉత్పత్నమవుతున్న నేపథ్యంలో శాశ్వత పరిష్కారం దిశగా పటిష్టమైన కార్యాచరణ రూపొందించాలని ఆయన ఆదేశాలు జారీ చేశారు.
వర్షాలు తగ్గుముఖం పట్టిన వెంటనే నిర్దేశిత రోజువారి బొగ్గు ఉత్పత్తి, బొగ్గు రవాణా లక్ష్యాలు సాధించాలని, ఈ ఆర్థిక సంవత్సరం చివరి కల్లా కనీసం 720 లక్షల టన్నుల ఉత్పత్తి లక్ష్యాన్ని దాటాలని పిలుపునిచ్చారు. కొత్త గనులను కూడా సకాలంలో ప్రారంభించేందుకు ప్రత్యేక చొరవ చూపాలని ఆయన ఏరియా జీయం లను కోరారు. భారీ వర్షాల వల్ల బొగ్గు ఉత్పత్తి కుంటుపడకుండా ఏరియాల్లో తీసుకున్న జాగ్రత్తలను ఆయన సమీక్షించారు. ఈ సమావేశంలో డైరెక్టర్ ఈ అండ్ ఎం డి.సత్యనారాయణ రావు, డైరెక్టర్ ఆపరేషన్స్ ఎన్.వి.కె. శ్రీనివాస్, డైరెక్టర్ ప్లానింగ్ అండ్ ప్రాజెక్ట్స్ జి.వెంకటేశ్వర్ రెడ్డి, అడ్వైజర్ మైనింగ్ డి.ఎన్.ప్రసాద్, అడ్వైజర్ ఫారెస్ట్రీ సురేంద్ర పాండే, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కోల్ మూమెంట్ జె.ఆల్విన్, జనరల్ మేనేజర్ కోఆర్డినేషన్ ఎం.సురేష్, కార్పొరేట్ జనరల్ మేనేజర్లు జక్కం రమేష్.,సీపీపీ, మల్లెల సుబ్బారావు., ఎంపీ దేవేందర్., మార్కెటింగ్, ఎల్వీ సూర్యనారాయణ, సియంసీ, కొత్తగూడెం నుంచి కార్పొరేటర్ ఉన్నతాధికారులు, అన్ని ఏరియాల జనరల్ మేనేజర్లు అధికారులు పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News