శ్రీశైలం ఎడమ గట్టు కాలువ (ఎస్ఎల్బీసీ) సొరంగ మార్గంలో పైకప్పు కూలిన ఘటనలో సహాయక చర్యలు ముమ్మరంగా కొనసాగుతున్నాయి. ఇద్దరు ఇంజినీర్లు, ఇద్దరు ఆపరేటర్లు, నలుగురు కార్మికులు టన్నెల్లో చిక్కుకున్న విషయం తెలిసిందే. వారిని కాపాడేందుకు ఎన్డీఆర్ఎఫ్, సైనిక బృందాలు లోపలికి వెళ్లాయి.

మంత్రులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, జూపల్లి కృష్ణారావు సహాయక చర్యలను పర్యవేక్షిస్తూ.. అధికారులతో సమీక్షలు నిర్వహిస్తున్నారు. సహాయక చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఎన్డీఆర్ఎఫ్, సైనిక బృందాలతో పాటు మంత్రి జూపల్లి కృష్ణారావు కూడా లోకో ట్రైన్ లో సొరంగంలోకి వెళ్లారు.

సొరంగం లోపలికి ఆక్సిజన్ పంపుతున్నామని, వాటర్ తోడేసే పనులు నిరంతరం సాగుతున్నాయని మంత్రి జూపల్లి కృష్ణారావు వెల్లడించారు. రెస్క్యూ టీమ్లు రాత్రి నుంచి అక్కడే పని చేస్తున్నాయని చెప్పారు. కూలిన మట్టి, నీరు చేరడంతో సహాయక చర్యలకు ఆటంకం ఏర్పడుతోందని, వాటిని తొలగించే పనిలో సహాయక బృందాలు శ్రమిస్తున్నాయని మంత్రి జూపల్లి. ఇప్పటికే టన్నెల్ బోర్ మిషన్ (TBM) వరకూ సహాయక బృందాలు చేరుకున్నాయని, కార్మికులను రక్షిస్తామని మంత్రి జూపల్లి ధీమా వ్యక్తం చేశారు.
