Friday, September 20, 2024
HomeతెలంగాణSrinivas Goud: కలిసికట్టుగా ఉండి నడిపించాలి

Srinivas Goud: కలిసికట్టుగా ఉండి నడిపించాలి

హైదరాబాద్ లో 10 అంతస్తుల లండన్ ఐ

మహబూబ్ నగర్ జిల్లా కేంద్రం సమీపంలోని అప్పన్నపల్లి వద్ద 30 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించిన రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జిని మంత్రి శ్రీనివాస్ గౌడ్ ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గతంలో మహబూబ్ నగర్ అప్పన్నపల్లి మొదటి రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మించేందుకు 12 సంవత్సరాలు పట్టిందని, డిజైన్ సైతం సరిగా లేదని, బ్రిడ్జి కట్టిన సంవత్సరానికి యాక్సిడెంట్ తో ఎంతో మంది చనిపోయారని, అదే రోజున రెండో ఆర్ ఓ బి కోసం పట్టుబట్టి ప్రకటించడం జరిగిందని, అనుకున్న లక్ష్యం ప్రకారం కేవలం 12 నెలల్లోనే రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసిన ఘనత తమదని మంత్రి అన్నారు. మొదటి బ్రిడ్జి నిర్మాణానికి స్థలాలు కోల్పోయిన వాళ్ళు,ఇండ్లు కోల్పోయిన వారికి నష్టపరిహారం ఇవ్వడంలో దళారీలు జోక్యం చేసుకున్నారని, కానీ తాము నిర్మించిన రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జికి పూర్తిస్థాయిలో బాధితులను ఒప్పించి వారు సమ్మతించిన తర్వాతే వారికి అన్ని రకాలుగా నష్టపరిహారాన్ని చెల్లించి రెండవ రైల్వే ఓవర్ బ్రిడ్జిని పూర్తి చేసామని అన్నారు.

- Advertisement -

తెలంగాణ రాష్ట్రం నూతనంగా ఏర్పడిన చిన్న రాష్ట్రమైనప్పటికీ ప్రతి సంవత్సరం కేంద్రానికి 46వేల కోట్ల రూపాయలను చెల్లిస్తున్నదని, అందులో కేవలం 20 నుండి 26,000 వేల కోట్లు మాత్రమే తిరిగి రాష్ట్రానికి పథకాల పేరుమీద వస్తున్నాయని తెలిపారు.తెలంగాణ చిన్న రాష్ట్రం అయినప్పటికీ సొంత వనరులతో అన్ని సంక్షేమ పథకాలను అమలు చేస్తున్నామని మంత్రి వెల్లడించారు.
మహబూబ్ నగర్ లో రహదారులతో పాటు, జంక్షన్లు, విద్యాసంస్థలు, వైద్య సంస్థలు, అన్నింటిని అభివృద్ధి చేస్తున్నామని, పర్యాటకంగా ఎంతో అభివృద్ధి చేశామని, మినీ ట్యాంక్ బండ్, శిల్పారామం నిర్మించామని, దేశంలోనే అతిపెద్దదైన ఎకో పార్కును ఏర్పాటు చేశామని, త్వరలోనే మహబూబ్ నగర్ లో 500 డ్రోన్ కెమెరాలతో లేజర్ ప్రదర్శన ఏర్పాటు చేయబోతున్నట్లు మంత్రి తెలిపారు. మినీ ట్యాంక్ బండ్,కేబుల్ బ్రిడ్జి ఏర్పాటు చేస్తున్నామని, అభివృద్ధి పథంలో ప్రతి ఒక్కరు కలిసికట్టుగా ఉండి ముందుకు నడిపించాలని, భవిష్యత్తులో మహబూబ్ నగర్ ను మరింత అద్భుతంగా తీర్చిదిద్దుతామని తెలిపారు. వచ్చే సంవత్సరం నాటికి శిల్పారామం వద్ద వండర్ లా ను ఏర్పాటు చేస్తామని, లండన్ తరహాలో 10 అంతస్తుల జెయింట్ వీల్ ఏర్పాటు చేస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. జిల్లా కలెక్టర్ జి. రవి నాయక్, ఎస్పీ కే. నరసింహ, జిల్లా గ్రంథాలయ సంస్థ అధ్యక్షులు. రాజేశ్వర్ గౌడ్ ,ముడాచైర్మన్ గంజి వెంకన్న, మున్సిపల్ చైర్మన్ కేసీ నర్సింహులు, జిల్లా రైతుబంధు సమితి కోఆర్డినేటర్ గోపాల్ యాదవ్, డి సీసీబి అధ్యక్షులు వెంకటయ్య ,జిల్లా ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ అధ్యక్షులు నటరాజ్, కౌన్సిలర్లు, ఇతర ప్రజాప్రతినిధులు, జిల్లా విద్యాశాఖ అధికారి రవీందర్ ,క్రీడల అభివృద్ధి అధికారి శ్రీనివాసులు, డిఎస్పి మహేష్ ,ఇతర అధికారులు ,ప్రజాప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు.
అనంతరం మంత్రి సుమారు 2000 మంది విద్యార్థులతో ఏర్పాటు చేసిన ఒలంపిక్ రన్ ప్రారంభించారు. ఈ రన్ అప్పన్నపల్లి రైల్వే ఓవర్ బ్రిడ్జి మొదలుకొని బైపాస్ వరకు నిర్వహించారు .ఈ కార్యక్రమంలో విద్యార్థులతో పాటు, యువత, అధ్యాపకులు, ఉపాధ్యాయులు, ప్రజా ప్రతినిధులు,అధికారుపు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News