తెలంగాణ ఆడపిల్లల ఆత్మగౌరవానికి ప్రతీకగా నిలిచే సద్దుల బతుకమ్మ సంబరాలు ఘనంగా జరిగాయి. వికారాబాద్ జిల్లా తాండూరు పట్టణంలోని ప్రభుత్వ కళాశాల మైదానంలో సద్దుల బతుకమ్మ వేడుకలు ఎమ్మెల్యే పైలెట్ రోహిత్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. వేడుకల్లో పైలెట్ రోహిత్ రెడ్డి కుటుంబ సమేతంగా బతుకమ్మ వేడుకల్లో పాల్గొని మహిళలతో కలసి ఉత్సాహంగా ఆడిపాడారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/46aa4417-44c2-4cc9-9f43-868f4c29c9ce-1024x683.jpg)
తీరొక్కపూలతో బతుకమ్మలను పేర్చి, గౌరమ్మకు మహిళలు పూజలు చేశారు. బతుకమ్మ పాటలతో ఆడిపాడారు. ప్రముఖ సినీ, జానపద సింగర్ మధుప్రియ బతుకమ్మ వేడుకల్లో పాల్గొని సందడి చేశారు. పట్టణ మహిళలు పెద్దసంఖ్యలో పాల్గొన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/6386829a-1235-4f5a-8a05-30b046146190.jpg)
ఆయా వార్డుల్లోని మహిళలు ఒకే వేదిక వద్దకు వచ్చి వేడుకల్లో పాల్గొన్నారు. శరన్నవరాత్రి నుండి ప్రారంభమయిన బతుకమ్మ వేడుకలు సద్దుల బతుకమ్మ వేడుకలతో బతుకమ్మ పండుగ సంబరాలు ముగిశాయి.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/4a145d71-dd3d-4185-9c18-9b7dbe37fe02-1024x576.jpg)
ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… మన సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన బాధ్యత అందరిపై ఉన్నదని తెలిపారు. ఇందుకోసం పండుగలను ఘనంగా నిర్వహించుకోవాలని పిలుపునిచ్చారు. ప్రతి ఆడబిడ్డ సంబురంగా జరుపుకొనే పండుగ బతుకమ్మ పండుగ అని అన్నారు. పూలు, ప్రకృతిని పూజించే మన సంస్కృతి ఎంతో గొప్పదని, తంగేడు పువ్వును రాష్ట్ర పుష్పంగా గుర్తించడం గర్వకారణమన్నారు.
![](https://b4qbdc.p3cdn1.secureserver.net/wp-content/uploads/2023/10/49d45db3-69a0-4c0b-beec-d44191654de4-1024x683.jpg)
బతుకమ్మను బీఆర్ఎస్ ప్రభుత్వం రాష్ట్ర పండుగగా నిర్వహిస్తున్నదని తెలిపారు. ఇట్టి వేడుకల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరుగకుండా పట్టణ సిఐ రాజేందర్ రెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు నిర్వహించారు.