Tuesday, June 10, 2025
HomeతెలంగాణTELANGANA CABINET EXPANSION UPDATE : కొత్త మంత్రులకు శాఖలు, పాత వారికి షాక్

TELANGANA CABINET EXPANSION UPDATE : కొత్త మంత్రులకు శాఖలు, పాత వారికి షాక్

మంత్రివర్గ విస్తరణ ఉత్కంఠకు తెరపడటంతో శాఖల కేటాయింపుపై రచ్చ. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఆసక్తికరంగా మారిన తెలంగాణ రాజకీయం. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు, ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల మార్పులు-చేర్పులు చేసే అవకాశం.

TELANGANA CABINET EXPANSION UPDATE : తెలంగాణలో మంత్రివర్గ విస్తరణ ఉత్కంఠకు తెరపడినా, ప్రస్తుతం శాఖల కేటాయింపు రచ్చ మొదలైంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనతో ఈ అంశం మరింత ఆసక్తికరంగా మారింది. కొత్త మంత్రులకు శాఖల కేటాయింపుతో పాటు, ఇప్పటికే ఉన్న మంత్రుల శాఖల మార్పులు-చేర్పులు కూడా ఉండొచ్చనే ప్రచారం పార్టీలో విస్తృతంగా జరుగుతోంది. ఢిల్లీలో కాంగ్రెస్ పెద్దలతో సీఎం సమావేశమై చర్చించిన తర్వాతే తుది నిర్ణయం తీసుకుంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి.

మంగళవారానికి స్పష్టత వచ్చే అవకాశం..
ఈ రాత్రికి లేదా మంగళవారానికి దీనిపై స్పష్టత వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మంత్రులు సమర్థవంతమైన పాలన అందిస్తూ ప్రజలకు వేగవంతమైన సేవలు అందించాలని భావిస్తున్నారట. తాజాగా ముగ్గురు కొత్త మంత్రులు – వాకిటి శ్రీహరి, అడ్లూరి లక్ష్మణ్‌కుమార్‌, గడ్డం వివేక్‌లకు శాఖలు కేటాయించాల్సి ఉంది.

మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి…
గత పది రోజులుగా రాష్ట్ర వ్యవహారాల ఇంఛార్జి మీనాక్షి నటరాజన్ రాష్ట్రంలోని ఎమ్మెల్యేలు, నేతల అభిప్రాయాలను సేకరించారు. ప్రభుత్వ పనితీరు, పార్టీ స్థితిగతులు, మంత్రుల పనితీరుపై తీవ్ర అసంతృప్తి వ్యక్తమైనట్లు సమాచారం. అధికారులు సహకరించడం లేదని, బీఆర్‌ఎస్‌ వాళ్లకే పనులు అవుతున్నాయని కొన్ని నియోజకవర్గాల నేతలు ఆందోళన వ్యక్తం చేసినట్లు సమాచారం.

ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు చేసే దిశగా…
ప్రస్తుత పరిస్థితుల్లో… సీఎం రేవంత్ రెడ్డి కొత్త మంత్రులకు శాఖలు కేటాయించడమే కాకుండా, కొందరు ప్రస్తుత మంత్రుల శాఖల్లో మార్పులు చేసేందుకు కూడా సిద్ధమైనట్లు విశ్వసనీయ వర్గాలు చెబుతున్నాయి. అవినీతి ఆరోపణలు ఎదుర్కొంటున్న, సమర్థవంతంగా పని చేయలేని మంత్రుల శాఖలు మారే అవకాశం ఉంది. నిఘా నివేదికలు, పార్టీ నాయకుల అభిప్రాయాలు, మంత్రుల పనితీరు వంటి అంశాలను పరిగణనలోకి తీసుకోనున్నారట. సీఎం వద్ద ఉన్న కొన్ని కీలక శాఖలు కూడా కొత్త మంత్రులకు కేటాయించే అవకాశం ఉంది.

ఏఐసీసీ తుది నిర్ణయం తర్వాతే…
అయితే, ఈ శాఖల కేటాయింపులు, మార్పులపై ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకోనుంది. స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గర పడుతుండటంతో, ఎటువంటి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకుని అధిష్ఠానం అనుమతితోనే రేవంత్ రెడ్డి నిర్ణయం ప్రకటిస్తారని పార్టీ శ్రేణులు చర్చించుకుంటున్నారు.
సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News