తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి(Revanth Reddy) ఏపీ పర్యటన ఖరారైంది. టీడీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి దేవినేని ఉమ కుమారుడి వివాహ వేడుకలో పాల్గొనేందుకు ఆయన విజయజవాడకు వెళ్లనున్నారు. రేపు(బుధవారం) ఉదయం 9.15 గంటలకు బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రత్యేక విమానంలో రేవంత్ రెడ్డి విజయవాడకు బయలుదేరుతారు. ఉదయం 10.40 గంటలకు విజయవాడ సమీపంలోని కానూరులో ఉన్న ధనేకుల ఇంజనీరింగ్ కాలేజ్ ప్రాంగణానికి చేరుకుంటారు. ఉదయం 10.50 గంటల నుంచి 11.30 గంటల వరకు జరిగే వివాహ వేడుకలో పాల్గొని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం విజయవాడ నుంచి తిరుగుపయనమై మధ్యాహ్నం 1 గంటకు హైదరాబాద్ చేరుకుంటారు.
మరోవైపు ఈ వివాహ వేడుకకు ఏపీ సీఎం చంద్రబాబు కూడా హాజరుకానున్నారు. ఈ క్రమంలో ఇరు తెలుగు రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఒకే వేదికపై కలుసుకునే అవకాశం ఉంది. కాగా గతంలో రేవంత్ రెడ్డి టీడీపీలో ఉన్నప్పుడు దేవినేని ఉమతో ఆయనకు సన్నిహిత సంబంధాలు ఉండేవి. ఈ నేపథ్యంలో తన కుమారుడి వివాహానికి హాజరుకావాలని రేవంత్ రెడ్డికి ఆహ్వాన పత్రికను అందజేశారు.