Google| దిగ్గజ గూగుల్ కంపెనీతో తెలంగాణ ప్రభుత్వం కీలక ఒప్పందం చేసుకుంది. దేశంలోనే మొట్టమొదటి గూగుల్ సేఫ్టీ ఇంజినీరింగ్ సెంటర్ (GSEC)ని హైదరాబాద్లో నెలకొల్పేందుకు గూగుల్ ముందుకొచ్చింది. ఈమేరకు సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy)తో కంపెనీ ప్రతినిధులు ఒప్పందం కుదుర్చుకున్నారు. జూబ్లీహిల్స్లోని సీఎం నివాసంలో జరిగిన ఈ కార్యక్రమంలో గూగుల్ ప్రతినిధులతో పాటు ఐటీ మంత్రి శ్రీధర్ బాబు, ఐటీ కార్యదర్శి జయేశ్ రంజన్, తదితర అధికారులు పాల్గొన్నారు.
హైదరాబాద్లో స్థాపించే సేఫ్టీ ఇంజనీరింగ్ సెంటర్ ప్రపంచంలోనే ఐదవది కావడం విశేషం. ఈ సెంటర్ అధునాతన భద్రత, ఆన్లైన్ భద్రతా ఉత్పత్తులను అభివృద్ధి చేయడంలో కీలక పాత్ర పోషిస్తుంది. అత్యాధునిక పరిశోధన, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఆధారిత భద్రత, సైబర్ సెక్యూరిటీ నిపుణులు, పరిశోధకులకు ఈ సేఫ్టీ సెంటర్ సహకార వేదికగా ఉపయోగపడుతుంది.


కాగా ఇప్పటికే ప్రపంచంలోనే అతి పెద్ద కార్యాలయాన్ని గూగుల్ హైదరాబాద్లో నిర్మిస్తోంది. ఇటీవల అమెరికా పర్యటనలో భాగంగా సీఎం రేవంత్ రెడ్డి గూగుల్ ప్రధాన కార్యాలయాన్ని సందర్శించారు. అప్పటి నుంచి హైదరాబాద్లో ఈ అత్యాధునిక సెంటర్ ఏర్పాటుకు ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపింది.
హైదరాబాద్లో ఈ సేఫ్టీ సెంటర్ ఏర్పాటు చేసేందుకు గూగుల్ ముందుకు రావటం చాలా ఆనందంగా ఉందని సీఎం రేవంత్ రెడ్డి తెలిపారు. గూగుల్తో ప్రభుత్వం ఒప్పందం చేసుకోవడంతో మరోసారి హైదరాబాద్ ప్రపంచంలో మేటీ ఐటీ, ఇన్నోవేషన్ హబ్గా అందరి దృష్టిని ఆకర్షిస్తుందన్నారు.