తెలంగాణ అభివృద్ధి పథంలో మరో ముందడుగు వేస్తూ.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం జపాన్ రాజధాని టోక్యోలో కీలక భేటీ అయ్యింది. ఏప్రిల్ 17, 2025న జరిగిన ఈ భేటీలో జపాన్ ఇంటర్నేషనల్ కోఆపరేషన్ ఏజెన్సీ (జైకా) ఉన్నతాధికారులతో చర్చలు జరిపారు. జైకా సీనియర్ వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా సహా పలువురు సీనియర్ మేనేజర్లు ఈ సమావేశానికి హాజరయ్యారు.
ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి రాష్ట్రంలో జరుగుతున్న మౌలిక వసతుల ప్రాజెక్టుల వివరాలు వివరించారు. ముఖ్యంగా హైదరాబాద్ మెట్రో రెండో దశ (రూ. 24,269 కోట్లు), మూసీ నది పునరుద్ధరణ, అవుటర్ రింగ్ రోడ్ నుంచి రీజనల్ రింగ్ రోడ్కు అనుసంధానంగా నిర్మించాల్సిన రేడియల్ రోడ్లు తదితర ప్రాజెక్టులకు జైకా సహకారం అవసరమని తెలియజేశారు. మెట్రో ఫేజ్-2కు మొత్తం వ్యయానికి 48% అయిన రూ. 11,693 కోట్ల రుణాన్ని జైకా మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఈ ప్రాజెక్టులు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల భాగస్వామ్యంతో చేపడుతున్నట్లు, ప్రస్తుతానికి కేంద్ర ఆమోదానికి సమీక్షలో ఉన్నట్లు జైకా బృందానికి వివరించారు. రాష్ట్ర ప్రభుత్వం విదేశీ రుణాలకు సంబంధించిన కేంద్ర నిబంధనలను పూర్తిగా పాటిస్తుందని హామీ ఇచ్చారు.
జైకా వైస్ ప్రెసిడెంట్ షోహెయ్ హరా మాట్లాడుతూ, తెలంగాణతో తమ బంధం దీర్ఘకాలంగా కొనసాగుతోందని గుర్తుచేశారు. మెట్రో విస్తరణ వంటి అర్హత కలిగిన ప్రాజెక్టుల కోసం కేంద్ర ప్రభుత్వంతో చర్చలు కొనసాగించాలని సూచించారు. ఇప్పటికే జపాన్ టోక్యో రైల్వే స్టేషన్ను పరిశీలించిన సీఎం, అక్కడి ఆధునిక రవాణా సదుపాయాలను విశ్లేషించారు. ఈ సందర్శనలో ఎంపీ కె. రఘువీర్ రెడ్డి, మెట్రో ఎండీ ఎన్వీఎస్ రెడ్డి, ఐటీ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ జయేష్ రంజన్, సీఎంఓ ప్రధాన కార్యదర్శి వి. శేషాద్రి, హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్ తదితరులు ఉన్నారు.
అదనంగా తెలంగాణ బృందం సోనీ కార్పొరేషన్, మారుబెని కార్పొరేషన్ లాంటి ప్రముఖ జపాన్ సంస్థలతో ప్రత్యేకంగా భేటీ అయ్యింది. మారుబెని కార్పొరేషన్ హైదరాబాద్ శివార్లలో ఫ్యూచర్ సిటీలో ఆధునిక పరిశ్రమల పార్క్ ఏర్పాటుకు ఆసక్తి చూపింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి లెటర్ ఆఫ్ ఇంటెంట్ (LoI) కుదిరింది. ఈ పార్క్ ద్వారా సుమారు 30,000 ఉద్యోగాలు వెలువడే అవకాశముందని ముఖ్యమంత్రి తెలిపారు. ఈ పర్యటనలో తెలంగాణ రాష్ట్రం ఆర్థిక, పరిశ్రమల అభివృద్ధిలో మరో మెట్టుపైకి ఎక్కుతుందని కాంగ్రెస్ నేతలు అంటున్నారు.