తెలంగాణ మంత్రివర్గ విస్తరణ(TG Cabinet expansion) జరిగింది. కొత్త మంత్రులుగా చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంటకస్వామి, ధర్మపురి ఎమ్మెల్యే అడ్లూరి లక్ష్మణ్ కుమార్, మక్తల్ ఎమ్మెల్యే శ్రీహరి ముదిరాజ్ ప్రమాణ స్వీకారం చేశారు. గవర్నర్ జిష్ణుదేవ్ శర్మ వారి చేత ప్రమాణ స్వీకారం చేయించారు. రాజ్ భవన్(Raj Bhavan)లో జరిగిన ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి, ఇతర మంత్రులు పాల్గొన్నారు.
మంత్రివర్గ విస్తరణలో భాగంగా మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేయబోతున్న వివేక్ వెంకటస్వామి, అడ్లూరి లక్ష్మణ్, వాకిటి శ్రీహరిలకు ముఖ్యమంత్రి అభినందనలు తెలిపారు. వీరితోపాటు శాసన సభలో ఉప సభాపతి బాధ్యతలు స్వీకరించబోతున్న రామచంద్రు నాయక్ కు కూడా విషెస్ చెప్పారు.
తెలంగాణ కాంగ్రెస్ వ్యవహారాల ఇన్ఛార్జి మీనాక్షి నటరాజన్ గత నాలుగు రోజులుగా హైదరాబాద్ లోనే మకాం వేశారు. సీఎం రేవంత్ రెడ్డి, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ తో విస్తృతంగా చర్చలు జరిపారు. చివరగా సామాజిక న్యాయాన్ని దృష్టిలో పెట్టుకొని కొత్త మంత్రులను ఎంపిక చేసినట్లు పార్టీ వర్గాలు తెలిపాయి.
కాగా ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర గడిచినప్పటికీ ఆరు మంత్రి పదవులు ఖాళీగా ఉన్నాయి. సీఎం రేవంత్ రెడ్డి వద్ద కీలకమైన హోం శాఖతో పాటు మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, పట్టణ అభివృద్ధి, విద్య, సాధారణ పరిపాలన వంటి శాఖలున్నాయి. ఈ విస్తరణ ద్వారా ఈ శాఖలను కొత్త మంత్రులకు అప్పగించి, పాలనా భారాన్ని తగ్గించడంతో పాటు, వివిధ శాఖల్లో పనితీరును మెరుగుపరచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. మరి నూతన మంత్రులకు ఏయే శాఖలు అప్పగిస్తారో తెలియాల్సి ఉంది.