Techno-Cultural Festival: తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల మధ్య సాంస్కృతిక, సాంకేతిక వారధిని నిర్మించేందుకు రాజ్భవన్ ఓ బృహత్తర కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. భాగ్యనగరంలో జరగనున్న “తెలంగాణ-నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్: ఏ టెక్నో-కల్చరల్ ఫెస్టివల్” కోసం మీ సృజనాత్మకతకు పట్టం గట్టేందుకు సిద్ధమైంది. ఈ ఉత్సవ స్ఫూర్తిని ప్రతిబింబించేలా లోగో, ట్యాగ్లైన్, పోస్టర్ను రూపొందించేందుకు దేశవ్యాప్తంగా ఉన్న కళాకారులు, విద్యార్థులు, డిజైనర్లు, సాధారణ ప్రజల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోంది.
సాంస్కృతిక వారధికి మీ సృజనను జోడించండి:
హైదరాబాద్ వేదికగా “తెలంగాణ-నార్త్ ఈస్ట్ ఇండియా కనెక్ట్: ఏ టెక్నో-కల్చరల్ ఫెస్టివల్” పేరిట ఈ సాంకేతిక, సాంస్కృతిక మహోత్సవాన్ని నిర్వహించనున్నారు.తెలంగాణ, ఈశాన్య భారతంలోని ఎనిమిది రాష్ట్రాలైన అరుణాచల్ ప్రదేశ్, అసోం, మణిపూర్, మేఘాలయ, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపురల మధ్య సాంకేతిక, సాంస్కృతిక పరిజ్ఞానాన్ని ఇచ్చిపుచ్చుకోవడం, తద్వారా ఇరు ప్రాంతాల మధ్య సంబంధాలను బలోపేతం చేయడమే ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం.ఈ ఉత్సవాన్ని రెండు విడతలుగా 2025 నవంబర్ 25 నుంచి 27 వరకు, డిసెంబర్ 2 నుంచి 4 వరకు హైదరాబాద్లో నిర్వహించనున్నారు.ఈ కార్యక్రమానికి తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల నుంచి సాంకేతిక, సాంస్కృతిక రంగాలకు చెందిన పలువురు ప్రముఖులు హాజరుకానున్నారు.
ఈ ఉత్సవ స్ఫూర్తిని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లేందుకు రాజ్భవన్ మూడు విభాగాల్లో పోటీలను ప్రకటించింది.
లోగో డిజైన్:
తెలంగాణ, ఈశాన్య రాష్ట్రాల సాంస్కృతిక ఐక్యత, సాంకేతిక ఆవిష్కరణలు, పరస్పర భావనలను ప్రతిబింబించేలా లోగో ఉండాలి. ఇది ఒరిజినల్గా, స్కేలబుల్గా, అధిక రిజల్యూషన్ ఉన్న పీఎన్జీ (PNG) ఎడిట్ చేయగల (AI/CDR/PSD) ఫార్మాట్లలో ఉండాలి.
ట్యాగ్లైన్ రైటింగ్: ఆంగ్లంలో, గరిష్టంగా 10 పదాలకు మించకుండా, ఆకట్టుకునేలా, అర్థవంతంగా ఉండాలి.
పోస్టర్ రూపకల్పన:
ఉత్సవ థీమ్కు అనుగుణంగా, ఆకర్షణీయంగా ఉండాలి. ఏ4 లేదా ఏ3 సైజులో, కనీసం 300 డీపీఐ రిజల్యూషన్తో పీడీఎఫ్ లేదా పీఎన్జీ ఫార్మాట్లో సమర్పించాలి.
పాల్గొనే విధానం, గడువు:
అర్హత: ఈ పోటీలో భారతదేశంలోని ఎవరైనా పాల్గొనవచ్చు.
దరఖాస్తు విధానం: ఆసక్తిగల అభ్యర్థులు తమ ఎంట్రీలను [email protected] ఈ-మెయిల్ చిరునామాకు పంపాలి. సబ్జెక్ట్ లైన్లో “Entry for Logo/Tagline/Poster – [Your Name]” అని స్పష్టంగా రాయాలి.
జత చేయాల్సినవి: ప్రతి ఎంట్రీతో పాటు పాల్గొనేవారి పూర్తి పేరు, వయస్సు, వృత్తి, సంప్రదించాల్సిన ఫోన్ నంబర్, ఈ-మెయిల్, గుర్తింపు/చిరునామా రుజువు, మీరు రూపొందించిన లోగో/ట్యాగ్లైన్/పోస్టర్ వెనుక ఉన్న భావనను వివరిస్తూ 50-100 పదాల సంక్షిప్త వివరణను జతచేయాలి.
చివరి తేదీ: ఆగస్టు 15, 2025.
విజేతలకు బహుమతులు:
ఉత్తమ లోగో డిజైన్: రూ.15,000
ఉత్తమ ట్యాగ్లైన్: రూ.5,000
ఉత్తమ పోస్టర్ డిజైన్: రూ.20,000
ఈ పోటీలకు సంబంధించిన మరిన్ని వివరాల కోసం రాజ్భవన్ అధికారిక వెబ్సైట్ http://www.governor.telangana.gov.inను సందర్శించవచ్చని గవర్నర్ ముఖ్య కార్యదర్శి ఎం. దాన కిషోర్, ఐఏఎస్, ఒక ప్రకటనలో తెలిపారు.


