Telangana Police advice to Public: దసరా పండుగ సందర్భంగా చాలా మంది పట్టణాల నుంచి తమ సొంత ఊర్లకు పయనం అవుతుంటారు. స్కూళ్లు, కాలేజీలకు వరుస సెలవుల నేపథ్యంలో మరికొంత మంది పిల్లలను తీసుకొని పుణ్యక్షేత్రాలు, విహారయాత్రలకు వెళ్తుంటారు. అయితే, ఇదే అదనుగా కేటుగాళ్లు రెచ్చిపోతుంటారు. తాళాలు ఉన్న ఇళ్లలో దొంగతనాలకు తెగపడుతుంటారు. ఈ నేపథ్యంలోనే తెలంగాణ పోలీసులు (Telangana Police) ఎక్స్ వేదికగా @TelanganaCOPs సోమవారం 12 రకాల కీలక టిప్స్ తెలియజేశారు.
తెలంగాణ పోలీసుల కీలక సూచనలు..
1. ఇంటికి తాళం వేసి వెళ్లే క్రమంలో తలుపు కనిపించకుండా పరదా వేయండి.
2. ఇంట్లోని ఒక గదిలో విద్యుత్ దీపం వెలిగేలా చూసుకోండి. ఇది ఇంట్లో ఎవరైనా ఉన్నారనే భ్రమను కలిగిస్తుంది.
3. మీరు దూర ప్రాంతాలకు వెళ్లే సమాచారాన్ని సోషల్ మీడియాలో ఎట్టి పరిస్థితుల్లోనూ పెట్టవద్దు.
4. కేవలం రూ. 5 వేలతో AI ఆధారిత సీసీ కెమెరాలు లభిస్తున్నాయి. వాటిని మీ ఇంట్లో అమర్చుకోండి. ఈ కెమెరాలు ఇంట్లోకి కొత్త వ్యక్తులు ప్రవేశిస్తే ఆటోమేటిక్గా లైట్లు వెలిగించడం, అలారం మోగించడం, మీ ఫోన్కు అలర్ట్ పంపించడం వంటి అధునాతన ఫీచర్లను కలిగి ఉంటాయి.
5. మీరు మీ ఫోన్లో లైవ్ స్ట్రీమింగ్ ద్వారా ఎక్కడి నుంచైనా మీ ఇంటిని పర్యవేక్షించవచ్చు. అందుకు అనుగుణంగా మీ ఇంటి మెయిన్ గేట్, డోర్, రూమ్ లోపలి ప్రాంతాలు కనిపించేలా కెమెరాలను అమర్చండి.
6. తలుపులు, కిటికీలకు సెన్సార్లతో కూడిన అలారం సిస్టమ్ను ఏర్పాటు చేసుకోండి.
7. సొంత ఇల్లు అయితే ప్రధాన ద్వారానికి ఇనుప గ్రిల్ పెట్టుకోవడం మంచిది.
8. బంగారం, వెండి, విలువైన వస్తువులు, నగదును ఇంట్లో ఉంచకుండా బ్యాంకు లాకర్లలో భద్రపరచండి.
9. మీరు ఎక్కువ రోజులు ఇంట్లో ఉండనట్లయితే స్థానిక పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వండి. దీనివల్ల ఆ ప్రాంతంలో పెట్రోలింగ్ను పెంచుతారు.
10. వాచ్మెన్ల ఆధార్ కార్డు, పూర్తి చిరునామా వివరాలను తెలుసుకోండి. ప్రముఖ సెక్యూరిటీ సర్వీసుల ద్వారా వాచ్మెన్లను నియమించుకోవాలి. వారి వివరాలు పోలీసులకు కూడా అందించాలి.
11. అపార్ట్మెంట్లలో భద్రతా సిబ్బందిని నియమించడం మంచిది.
12. కొత్త వ్యక్తులు, ఈ-కామర్స్, ఫుడ్ డెలివరీ బాయ్స్ వివరాలను రికార్డు చేయడానికి ప్రత్యేకంగా ఒక రిజిస్టర్ను మెయింటెయిన్ చేయండి.
దొంగలు ముందుగా రెక్కీ నిర్వహిస్తుంటారు కాబట్టి అనుమానాస్పదంగా ఎవరైనా కనిపిస్తే వెంటనే డయల్ 100కు సమాచారం ఇవ్వండి. పోలీసులు ఆరు నిమిషాల్లో ఘటనాస్థలికి చేరుకుంటారు.
Also Read: https://teluguprabha.net/sports-news/quinton-de-kock-re-entry-in-south-africa-team/
ప్రజల సహకారంతోనే నేరాల నియంత్రణ..
కాగా, ప్రజల సహకారంతో నేరాలను సమర్థవంతంగా నియంత్రించవచ్చని కమిషనర్ సుధీర్ బాబు పేర్కొన్నారు. దసరా పండుగ సందర్భంగా ప్రజలు ఈ జాగ్రత్తలు పాటిస్తూ సురక్షితంగా ఉండాలని ఆయన కోరారు.కాగా, తెలుగు రాష్ట్రాల్లో అతిపెద్ద పండుగా జరుపుకునే దసరా అక్టోబర్ 2న జరగనుంది. ఈ నేపథ్యంలోనే విద్యా సంస్థలకు ఆదివారం నుంచి ఆక్టోబరు 3 వరకు ప్రభుత్వం దసరా సెలవులు ప్రకటించింది. దీంతో, ప్రజలు నగరాలు, పట్టణాల నుంచి పల్లెటూళ్లకు పయనమవుతున్నారు.


