Saturday, November 15, 2025
HomeTop StoriesTelangana Rising Vision-2047: రాష్ట్రంలో మరో సర్వే.. తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 పేరిట అభిప్రాయాల సేకరణ

Telangana Rising Vision-2047: రాష్ట్రంలో మరో సర్వే.. తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 పేరిట అభిప్రాయాల సేకరణ

Telangana Rising Vision Survey-2047 : కాంగ్రెస్‌ ప్రభుత్వం రాష్ట్రంలో మరో సర్వేకు శ్రీకారం చుట్టింది. 2047 నాటికి దేశానికి స్వాతంత్య్రం సాధించి వందేండ్లు పూర్తి కానున్న నేపథ్యంలో తెలంగాణ రైజింగ్‌ విజన్‌-2047 పేరుతో సర్వే చేపట్టనుంది. తెలంగాణలో చేపట్టే ఈ సర్వేలో ప్రజలంతా పాల్గొనాలని, అభిప్రాయాలను, ఆలోచనలను పంచుకోవాలని ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్‌ రంజన్‌ పిలుపునిచ్చారు. ఈ మేరకు ఒక ప్రకటన విడుదల చేశారు. ఈ సర్వేలో తెలంగాణ అభివృద్ధి కోణం ఎలా ఉండాలన్న దానిపై రాష్ట్ర ప్రభుత్వం ప్రజాభిప్రాయ సేకరణకు సిద్ధమైంది. మొత్తం 8 అంశాలపై ఈ సర్వే నిర్వహిస్తోంది. ఈనెల 10 నుంచి ప్రారంభమైన ఈ సర్వే 25వ తేదీ వరకు కొనసాగనుంది. ఈ సర్వేలో తెలంగాణ ప్రజల అభిప్రాయాలను ఆన్‌లైన్‌ ద్వారా సేకరిస్తారు. తెలంగాణలోని ప్రతి పౌరుని జీవన ప్రమాణాలను మెరుగుపర్చడమే లక్ష్యంగా ఈ రైజింగ్‌ కాన్సెప్ట్‌ను ముందుకు తీసుకెళ్లనున్నట్లు ప్రభుత్వం చెబుతోంది. రాష్ట్రంలోని ప్రతి గ్రామం, జిల్లా, పట్టణం, నగరాల్లోని ప్రజల స్వరం, కలలు, ఆలోచనల ఆసరాగా భవిష్యత్‌ తెలంగాణ కోసం ఈ సర్వే చేపట్టనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. అందులో భాగంగానే 15 రోజులపాటు రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజల నుంచి అభిప్రాయ సేకరించాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. సర్వేలో భాగంగా 8 ప్రశ్నలను రూపొందించింది. ప్రతి ప్రశ్నకు కొన్ని సమాధానాలిచ్చి వాటిలో ఎలా వెళితే బాగుంటుందో సూచించాలని కోరింది. www.telangana.gov. telanganarising అనే వెబ్‌సైట్‌లో ఈ సర్వేను పొందుపరిచింది.

- Advertisement -

సర్వేలో పేర్కొన్న అంశాలివే..

త్రీ ట్రిలియన్‌ ఎకానమీ

2047 నాటికి త్రీ ట్రిలియన్‌ ఎకనామీ సాధించడంలో భాగంగా ఉద్యోగాలకు అవసరమైన రంగాల్లో కోర్సులు, స్టార్టప్‌లకు ప్రోత్సాహం, వ్యవసాయ అనుబంధ రంగాల్లో నూతన ఆవిష్కరణలు, పారిశ్రామిక వాతావరణం కల్పనలో భాగంగా విధానాల్లో సంస్కరణల అమలు, యువత నాయకత్వంలో వ్యాపారాలపై సర్వే దృష్టి సారించనుంది.

మీ ఆలోచన మేరకు విజన్‌

వీలున్నంత సమీపంలో మంచి పాఠశాలలు, ఆస్పత్రుల ఏర్పాటు, మీమీ ప్రాంతాల్లో ఉద్యోగ, వ్యాపార అవకాశాల కల్పన, మహిళల రక్షణ, మరిన్ని అవకాశాల కల్పన, గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో ఆధునిక సేవలు కల్పించడంపై సర్వే జరగనుంది.

అభివృద్ధి రంగాలు

ఐటీ–ఏఐ–సైబర్‌ సెక్యూరిటీ, ఫుడ్‌ ప్రాసెసింగ్‌–అగ్రిటెక్‌–కోల్డ్‌ స్టోరేజి, ఫార్మా– బయోటెక్‌–ఆరోగ్య ఆవిష్కరణలు, ఎలక్ట్రానిక్స్‌ అండ్‌ సెమీకండక్టర్ల తయారీ, పర్యాటకం–సాంస్కృతిక–సినీ–సృజనాత్మకత, డ్రోన్స్‌–అంతరిక్ష శాస్త్రం–రక్షణ వంటి అంశాలపై సర్వే జరగనుంది.

మెరుగైన జీవితం

అందరికీ స్వచ్ఛమైన గాలి, నీటి లభ్యత, మెరుగైన పారిశుధ్యం, చివరి మైలు వరకు బస్సు, రైలు మార్గాల అనుసంధానం, రక్షిత, సరసమైన గృహ సదుపాయంపై సర్వే కొనసాగనుంది.

అందరికీ ఆరోగ్యం, శ్రేయస్సు

ప్రతి మండలానికి ఆస్పత్రి, మొబైల్‌ ఆరోగ్య వాహనం ఏర్పాటు, తక్కువ ధరలకే ఆరోగ్య పరీక్షలు, మందులు, టెలీమెడిసిన్‌ లభ్యత, పరిశుభ్రమైన నీరు, పారిశుధ్యం, వ్యాధి నియంత్రణ, సరసమైన ధరలకు మానసిక ఆరోగ్య కౌన్సెలర్ల లభ్యత, ఆరోగ్య బీమా వంటి అంశాలపై సర్వే జరగనుంది.

అందరికీ విద్య, నైపుణ్యాలు

ఆర్టిఫిషియల్‌ ఇంటెలిజెన్స్, రోబోటిక్స్, వాతావరణ, పారిశ్రామిక రంగాలపై బోధన, ఆధునిక శిక్షణ పరికరాలు, సుశిక్షుతులైన ఉపాధ్యాయులు, కళాశాలలు, ఐటీఐలలో నైపుణ్య ఆధారిత కోర్సులు, ప్రపంచ స్థాయి విశ్వవిద్యాలయాల ఏర్పాటుకు సానుకూలత కల్పించడం, సాఫ్ట్‌ స్కిల్స్‌ అభివృద్ధి వంటి అంశాలపై సర్వే నిర్వహించనుంది.

పాలన–పౌర సేవలు

అన్ని రకాల ప్రభుత్వ సేవలకు ఒకటే పోర్టల్‌. ప్రజలకు అందుబాటులో ప్రతి ప్రాంతంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల సమాచారం, తగినన్ని నిధులు, అధికారాలతో స్థానిక సంస్థల బలోపేతంపై సర్వే జరగనుంది.

2047లో తెలంగాణ ఎలా ఉండాలో మీరే చెప్పండి..!

పైన పేర్కొన్న ఏడు అంశాలపై ప్రజల నుంచి ఆప్షన్లను కోరిన ప్రభుత్వం 8వ అంశానికి సంబంధించి తెలంగాణ ఎలా ఉండాలని ఊహించుకుంటున్నారో తమ ఆలోచనను అక్షర లేదా స్వర రూపంలో ఇవ్వాలని ఈ సర్వేలో కోరింది. తెలంగాణ రైజింగ్‌ విజన్‌ 2047 అనేది కేవలం విధాన పత్రం కాదని, ఇది తెలంగాణ ప్రజలందరి ఉమ్మడి స్వప్నం కావాలని కోరింది. రాష్ట్ర భవిష్యత్‌ నిర్మాతలు ప్రజలే అని గుర్తు చేసింది. ప్రజలందరూ కొంత సమయాన్ని వెచ్చించి ఈ చారిత్రక కసరత్తులో భాగస్వాములై మీ విలువైన అభిప్రాయాలను అందించాలని కాంగ్రెస్‌ ప్రభుత్వం కోరింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad