Saturday, November 15, 2025
HomeతెలంగాణRelief for Farmers: రైతులకు 'యూరియా' ఊరట.. కష్టాలకు కళ్లెం వేస్తామన్న ప్రభుత్వం!

Relief for Farmers: రైతులకు ‘యూరియా’ ఊరట.. కష్టాలకు కళ్లెం వేస్తామన్న ప్రభుత్వం!

Urea supply for Telangana farmers : యూరియా కోసం చెప్పులరిగేలా తిరిగి, క్యూలైన్లలో పడిగాపులు కాసి, రోడ్డెక్కి రాస్తారోకోలు చేసిన తెలంగాణ రైతన్నకు ప్రభుత్వం ఎట్టకేలకు చల్లని కబురు చెప్పింది. రాష్ట్రంలో నెలకొన్న తీవ్ర యూరియా కొరతకు తెరదించుతూ, రాబోయే వారంలో భారీగా నిల్వలు రానున్నాయని ప్రకటించింది. కానీ, ఈ ప్రకటన క్షేత్రస్థాయిలో రైతుల కన్నీళ్లను తుడవగలదా..? తెల్లవారకముందే సహకార సంఘాల వద్ద పడిగాపులు కాస్తున్న అన్నదాతల కష్టాలు తీరతాయా..? అసలు, ‘అన్నపూర్ణ’గా పేరొందిన తెలంగాణలో యూరియాకు ఇంతటి కటకట ఎందుకు ఏర్పడింది..?

- Advertisement -

క్యూలైన్లలో రైతుల కన్నీళ్లు: గత నెల రోజులుగా రాష్ట్రవ్యాప్తంగా యూరియా కోసం రైతులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు.

రాత్రింబవళ్ల నిరీక్షణ: మెదక్, సిద్దిపేట, సంగారెడ్డి, వరంగల్, ఖమ్మం… ఇలా జిల్లా ఏదైనా, దృశ్యం ఒక్కటే. తెల్లవారకముందే సహకార సంఘాల వద్ద రైతులు చెప్పులు, రాళ్లను క్యూలో పెట్టి గంటల తరబడి పడిగాపులు కాస్తున్నారు.

తోపులాటలు, సొమ్మసిల్లడాలు: యూరియా బస్తాలు రాగానే దొరుకుతాయో లేదోనన్న ఆందోళనతో రైతుల మధ్య తోపులాటలు జరిగాయి. మహబూబాబాద్‌లో ఓ రైతు క్యూలైన్‌లోనే ఫిట్స్ వచ్చి కుప్పకూలిపోయాడు.

రోడ్డెక్కిన అన్నదాతలు: సహనం నశించిన రైతులు ఖమ్మం, కరీంనగర్, నాగర్‌కర్నూల్ జిల్లాల్లో జాతీయ రహదారులపై బైఠాయించి రాస్తారోకోలతో తమ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. “పది ఎకరాలుంటే ఒక్క బస్తా ఇస్తారా..?” అంటూ అధికారులను నిలదీశారు.

ప్రభుత్వం చొరవ.. ఢిల్లీకి మంత్రులు: రైతుల కష్టాలపై స్పందించిన ప్రభుత్వం, నివారణ చర్యలకు ఉపక్రమించింది.

తక్షణ సరఫరా: సోమవారం రాష్ట్రానికి 9వేల టన్నుల యూరియా చేరిందని, మరో వారంలో మొత్తం 27,470 టన్నుల యూరియా వస్తుందని వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ప్రకటించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా, పారదర్శకంగా పంపిణీ చేయాలని ఆయన అధికారులను ఆదేశించారు.

కేంద్రంతో చర్చలు : రాష్ట్రంలో నెలకొన్న యూరియా కొరత, వరదల వల్ల జరిగిన నష్టం వంటి సమస్యలపై కేంద్ర ప్రభుత్వంతో చర్చించేందుకు ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు బుధవారం ఢిల్లీ పర్యటించనున్నారు. ఈ పర్యటనలో భాగంగా, ఇరువురు మంత్రులు కేంద్ర మంత్రులతో సమావేశమై, రాష్ట్రానికి అవసరమైన యూరియా సరఫరా, వరద బాధితులకు కేంద్రం నుంచి ఆర్థిక సహాయం వంటి విషయాలపై చర్చించనున్నారు.

వరద నష్టంపై సర్వే: ఇటీవల కురిసిన భారీ వర్షాల వల్ల కలిగిన పంట నష్టంపై ఐదు రోజుల్లో సర్వే పూర్తి చేసి, నివేదిక ఇవ్వాలని కూడా మంత్రి తుమ్మల అధికారులను ఆదేశించారు. ప్రభుత్వం చేసిన ప్రకటనతో రైతన్నలో కొంత ఆశ చిగురించింది. అయితే, ప్రకటించిన యూరియా నిల్వలు క్షేత్రస్థాయికి సకాలంలో చేరి, ఎలాంటి అవకతవకలకు తావులేకుండా పంపిణీ జరిగితేనే వారి కష్టాలు గట్టెక్కినట్లు. లేదంటే, క్యూలైన్ల కన్నీటి కథలు పునరావృతమయ్యే ప్రమాదం లేకపోలేదు.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News

Ad