Organ Retrieval Centres: ప్రభుత్వ హాస్పిటల్స్లో అవయవ మార్పిడి సర్జరీలను ప్రోత్సహించేందుకు చర్యలు తీసుకోవాలని ఆరోగ్యశాఖ ఉన్నతాధికారులను మంత్రి దామోదర్ రాజనర్సింహ ఆదేశించారు. ఈ మేరకు బుధవారం జీవన్దాన్ పనితీరు, ప్రభుత్వ దవాఖాన్లలో అవయవ మార్పిడి చికిత్సలను ప్రోత్సహించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై జూబ్లిహిల్స్లోని ఆరోగ్యశ్రీ ట్రస్ట్ కార్యాలయంలో అధికారులతో మంత్రి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. నిమ్స్, గాంధీ, ఉస్మానియాతో పాటు ఆదిలాబాద్ రిమ్స్, వరంగల్ ఎంజీఎంలోనూ అవయవమార్పిడి సర్జరీలు జరిగేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు.
అన్ని ఉమ్మడి జిల్లా కేంద్రాల్లో ఆర్గాన్ రిట్రైవల్ సెంటర్ల ఏర్పాటుకు ప్రతిపాదనలు రూపొందించాలన్నారు. సీనియర్ డాక్టర్లతో డెడికేటెడ్ టీమ్స్ ఏర్పాటు చేయాలని, ఒక్కో ఆర్గాన్కు ఒక్కో టీమ్ ఉండాలని హెల్త్ సెక్రటరీ క్రిస్టినా జడ్ చొంగ్తుకు మంత్రి సూచించారు. ప్రభుత్వ హాస్పిటల్స్లో అవయవమార్పిడి సర్జరీలను ప్రోత్సహించే విధంగా ఈ బృందాలు పనిచేయాలన్నారు. ఇటీవల కేంద్ర చట్టాన్ని అడాప్ట్ చేసుకున్నందున ఇందుకు అనుగుణంగా కొత్త నిబంధనల రూపకల్పనపై సమావేశంలో చర్చించారు. ఈ చట్టం ప్రకారం సొంత కుటుంబ సభ్యులతో పాటు, గ్రాండ్ పేరెంట్స్ కూడా అవయవాలు డొనేట్ చేసేందుకు, స్వీకరించేందుకు అర్హులేనని ఈ నిబంధనను అమలు చేస్తున్నామని అధికారులు తెలిపారు. తోట యాక్ట్, ( ట్రాన్స్ ప్లాంటేషన్ ఆఫ్ హ్యుమన్ ఆర్గాన్స్ అండ్ టీష్యూస్ రూల్స్, 2014) ప్రకారం ఆర్గాన్ స్వాపింగ్కు కూడా అవకాశం ఇవ్వాలని అధికారులకు మంత్రి సూచించారు. ఈ యాక్ట్ ప్రకారం ఇరువురు పేషెంట్ల కుటుంబ సభ్యులు ఒకరికొకరు ఆర్గాన్స్ డొనేట్ చేసుకునే వెసులుబాటు ఉంటుందన్నారు. స్వాపింగ్ విషయంలో ఇతర రాష్ట్రాలు అవలంభిస్తున్న నిబంధనలను పరిశీలించి, బాధితులను ఆదుకునే విధంగా నిబంధనలు రూపొందించాలని మంత్రి అధికారులను ఆదేశించారు.
అవయవదానంపై అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని జీవన్దాన్ కోఆర్డినేటర్, డాక్టర్ భూషన్రాజుకు మంత్రి సూచించారు. దీనికోసం ప్రజా ప్రతినిధులు, ప్రముఖుల సహకారం తీసుకోవాలన్నారు. ఆర్గాన్ డోనర్ల కుటుంబ సభ్యులకు అండగా నిలవాల్సిన అవసరం ఉందని ఈ సందర్భంగా మంత్రి తెలిపారు. బ్రెయిన్ డెత్ అయిన వారి అవయవాలను ఇతరులకు డోనేట్ చేసి ఆదర్శంగా నిలుస్తున్న కుటుంబాలను అందరూ అభినందించాలన్నారు. ఆర్గాన్ డోనర్ల దహన సంస్కారాలకు ఆర్థిక సాయం అందించడంతో పాటు, వారి కుటుంబాలకు అండగా ఉండేందుకు అవసరమైన ప్రతిపాదనలు రూపొందించాలని అధికారులను మంత్రి ఆదేశించారు. ప్రైవేటు, కార్పొరేట్ హాస్పిటళ్లలో జరుగుతున్న అవయవమార్పిడి సర్జరీలపై నిరంతరం నిఘా పెట్టాలని ఉన్నతాధికారులను మంత్రి ఆదేశించారు. నిబంధనలు ఉల్లంఘించే హాస్పిటళ్ల విషయంలో కఠినంగా వ్యవహరించాలని మంత్రి సూచించారు.


