TG MLAs Disqualification Petition: రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ నుంచి గెలిచి కాంగ్రెస్లో చేరిన ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్లపై విచారణకు షెడ్యూల్ ఖరారైంది. ఈ నెల 29న ఉదయం 11 గంటలకు ఈ విచారణలు ప్రారంభం కానున్నాయి. ఉదయం 11 గంటలకు రాజేంద్ర నగర్ ఎమ్మెల్యే ప్రకాష్ గౌడ్ విచారణ ప్రారంభం కానుంది. అదేరోజు మధ్యాహ్నం 12 గంటలకు చేవెళ్ల ఎమ్మెల్యే కాలే యాదయ్య విచారణ జరగనుంది. మధ్యాహ్నం ఒంటి గంటకు పటాన్చెరు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డిని, మధ్యాహ్నం 3 గంటలకు గద్వాల్ ఎమ్మెల్యే బండ్ల కృష్ణమోహన్ రెడ్డిని విచారించనున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana-news/atc-centres-inauguration-by-cm-revanth-reddy-in-hyderabad/
కాగా అనర్హత పిటిషన్లపై సోమవారం నుంచి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ విచారణ జరుపుతారు. ఈ సందర్భంగా క్రాస్ ఎగ్జామినేషన్ దశలో న్యాయవాదులు కీలక వాదనలు వినిపించనున్నారు. అక్టోబర్ 1న (బుధవారం) మరోసారి అదే కేసులపై విచారణలు కొనసాగనున్నాయని ప్రకటన వెలువడింది. పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున న్యాయవాదులు ప్రత్యక్ష వాదనలు జరగనున్నాయి. స్పీకర్ లేదా ఛైర్మన్ ఆధ్వర్యంలో 10వ షెడ్యూల్ ప్రకారం విచారణ నిర్వహిస్తారు.
కాగా, పార్టీ ఫిరాయింపు ఆరోపణలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కడియం శ్రీహరి, కాలే యాదయ్య, అరికెపూడి గాంధీ, ప్రకాశ్ గౌడ్లు శుక్రవారం స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ను కలిశారు. అదే రోజు మధ్యాహ్నం అసెంబ్లీలోని స్పీకర్ ఛాంబర్లో మంత్రి శ్రీధర్ బాబు సమక్షంలో ఒక్కో ఎమ్మెల్యే స్పీకర్ను కలవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.


