TGSRTC Charges Hike: తెలంగాణలో పండుగల నేపథ్యంలో ఆర్టీసీ బస్సు టికెట్ ఛార్జీలను పెంచినట్లు వస్తున్న వార్తలపై టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పందించింది. టికెట్ ఛార్జీలు పెరిగాయనే ప్రచారాన్ని ఖండించింది. ఈ వార్తల్లో ఏమాత్రం వాస్తవం లేదని స్పష్టం చేసింది.
ప్రధాన పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం జీఓ నంబర్ 16 మేరకు తిరుగు ప్రయాణంలో ఖాళీగా వచ్చే సర్వీసులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరలను సంస్థ సవరిస్తుందని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం వెల్లడించింది. స్పెషల్ బస్సుల్లో మాత్రమే సాధారణ ఛార్జీలో 50 శాతం వరకు సవరణ అమల్లో ఉంటుందని పేర్కొంది. 2003 నుంచి ఈ పద్ధతి ఆనవాయితీగా వస్తోందని స్పష్టత ఇచ్చింది. కానీ ఇప్పుడే స్పెషల్ బస్సుల్లో కొత్తగా ఛార్జీలను సవరణ చేస్తున్నట్లు కొందరు దుష్ప్రచారం చేయడం మానుకోవాలని వ్యాఖ్యానించింది.
రాష్ట్రంలో సంక్రాంతి, దసరా, రాఖీ పౌర్ణమి, వినాయక చవితి, ఉగాది తదితర ప్రధాన పండుగల సమయాల్లో హైదరాబాద్ నుంచి ప్రయాణికులు ఎక్కువగా సొంతూళ్లకు వెళ్తుంటారు. ఈ సందర్భాల్లో ప్రజలకు రవాణా పరంగా ఇబ్బందులు తలెత్తకుండా వారిని క్షేమంగా గమ్యస్థానాలకు చేరవేసేందుకు స్పెషల్ సర్వీసులను టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం నడిపిస్తుంది. ప్రయాణికుల రద్దీ మేరకు హైదరాబాద్ సిటీ బస్సుల ద్వారా సర్వీస్ అందిస్తారు. తిరుగు ప్రయాణంలో ప్రయాణికుల రద్దీ ఉండకపోవడంతో ఖాళీగా ఆ బస్సులు వెళ్తుంటాయి. ఆ స్పెషల్ బస్సులకు అయ్యే కనీస డీజిల్ ఖర్చుల మేరకు టికెట్ ధరను సవరించుకోవాలని 2003లో జీఓ నంబర్ 16ను రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసింది. పండుగల సమయాల్లో నడిచే స్పెషల్ బస్సుల్లో మాత్రమే 50 శాతం వరకు టికెట్ ధరను సవరించుకునే వెసులుబాటును సంస్థకు ప్రభుత్వం అందించింది.
కాగా టీజీఎస్ఆర్టీసీలో ప్రస్తుతం 10 వేల వరకు బస్సులు సేవలందిస్తున్నాయి. పండుగ సమయాల్లో రద్దీకి అనుగుణంగా ప్రతి రోజు సగటున 500 నుంచి 1000 వరకు స్పెషల్ బస్సులను మాత్రమే సంస్థ నడిపిస్తుంది. ఆ స్పెషల్ బస్సుల్లో మాత్రమే జీఓ ప్రకారం ఛార్జీల సవరణ ఉంటుంది. మిగతా రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు ఉండదు. బతుకమ్మ, దసరా పండుగల నేపథ్యంలో ఇప్పుడు కూడా స్పెషల్ బస్సులను సంస్థ నడిపిస్తోంది.
రద్దీ ఎక్కువగా ఉండటం దృష్ట్యా ఈ నెల 20తో పాటు 27 నుంచి 30 వరకు వరకు, అలాగే అక్టోబర్ 1, 5, 6 వ తేదిల్లో నడిచే స్పెషల్ బస్సుల్లోనే ఛార్జీల సవరణ ఉండనుంది. ఆయా రోజుల్లో తిరిగే రెగ్యులర్ సర్వీసుల ఛార్జీల్లో ఎలాంటి మార్పు లేదు. ఈ నేపథ్యంలో పండుగల సమయాల్లో నడిచే అన్ని బస్సుల్లోనూ ఛార్జీలను సవరించారని కొందరు ఉద్దేశపూర్వకంగా ప్రచారం చేస్తున్నారని.. ఈ ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని టీజీఎస్ఆర్టీసీ యాజమాన్యం స్పష్టం చేసింది.


