TGSRTC Special Buses: బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా టీజీఎస్ఆర్టీసీ ప్రయాణికులకు గుడ్న్యూస్ చెప్పింది. ప్రయాణికుల రద్దీని దృష్టిలో పెట్టుకొని ఈ నెల 20 నుంచి అక్టోబరు 2 వరకు మొత్తం 7,754 ప్రత్యేక బస్సులను నడపనున్నట్లు తెలిపింది. ఈ సర్వీసుల్లో 377 బస్సులకు ముందస్తు రిజర్వేషన్ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. పండుగ తర్వాత సొంతూళ్లకు వెళ్లినవారు తిరిగి వచ్చేందుకు వీలుగా అక్టోబర్ 5, 6 తేదీల్లో కూడా అవసరానికి తగ్గట్టుగా బస్సులను నడిపేందుకు సంస్థ ఏర్పాట్లు చేస్తోంది.
బస్సులు అందుబాటులో ఉండే ప్రాంతాలివే..!
హైదరాబాద్లోని ప్రధాన బస్టాండ్లైన ఎంజీబీఎస్, జేబీఎస్తో పాటు రద్దీ ఎక్కువగా ఉండే కేపీహెచ్బీ, ఉప్పల్, దిల్సుఖ్నగర్, ఎల్బీనగర్, ఆరాంఘర్ ప్రాంతాల నుంచి ఈ ప్రత్యేక బస్సులు బయలుదేరనున్నాయి. ఈ ప్రత్యేక సర్వీసులు తెలంగాణలోని అన్ని ప్రాంతాలకు, అలాగే ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, మహారాష్ట్రలకు కూడా అందుబాటులో ఉంటాయి. పండుగ సందర్భంగా నడిపే ఈ ప్రత్యేక బస్సులకు సాధారణ ఛార్జీల కంటే కొద్దిగా ఎక్కువ ఛార్జీలు ఉంటాయని టీజీఎస్ఆర్టీసీ తెలిపింది.
గతేడాదితో పోలిస్తే అదనంగా 617 బస్సులు..
టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనార్ మాట్లాడుతూ, ప్రయాణికులకు సురక్షితమైన ప్రయాణం అందించడానికి సంస్థ అన్ని ఏర్పాట్లు చేసిందని తెలిపారు. గత సంవత్సరంతో పోలిస్తే ఈసారి 617 అదనపు బస్సులను నడుపుతున్నామని చెప్పారు. రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో ప్రత్యేక బృందాలను, పర్యవేక్షణ అధికారులను నియమించి, అవసరానికి అనుగుణంగా బస్సులను అందుబాటులో ఉంచుతామని వివరించారు. ఈ ప్రక్రియలో పోలీసు, రవాణా, మున్సిపల్ శాఖలతో కలిసి పనిచేస్తున్నామని వెల్లడించారు. బస్సు సమయాలు, రిజర్వేషన్కు సంబంధించిన పూర్తి వివరాల కొరకు టీజీఎస్ఆర్టీసీ అధికారిక వెబ్సైట్ http://tgsrtcbus.in ను సందర్శించాలని కోరారు. సందేహాల నివృత్తికి 040-69440000 లేదా 040-23450033 నంబర్లను సంప్రదించవచ్చని తెలిపారు. “బతుకమ్మ, దసరా పండుగల దృష్ట్యా ప్రజలకు సురక్షితమైన, సౌకర్యవంతమైన ప్రయాణాన్ని అందించడానికి సంస్థ సంసిద్ధంగా ఉంది. గత దసరా కంటే ఈ సారి అదనంగా 617 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేశాం. రద్దీ ప్రాంతాల్లో ప్రత్యేక క్యాంప్ లను ఏర్పాటు చేసి ప్రయాణికులకు అన్ని సౌకర్యాలను కల్పిస్తున్నాం. ముఖ్యంగా ఎల్బీనగర్, ఉప్పల్, ఆరాంఘర్, కేపీహెచ్బీ, సంతోష్ నగర్, తదితర ప్రాంతాల్లో ప్రయాణికుల సౌకర్యార్థం షామియానాలు, కూర్చీలు, తాగునీరు, తదితర మౌలిక సదుపాయాలతో పాటు పబ్లిక్ అడ్రస్ సిస్టంను ఏర్పాటు చేయాలని క్షేత్రస్థాయి అధికారులకు ఇప్పటికే ఆదేశాలు జారీ చేశాం. ప్రతి రద్దీ ప్రాంతం వద్ద పర్యవేక్షణ అధికారులను నియమిస్తున్నాం. ప్రయాణికుల రద్దీని బట్టి వారు ప్రత్యేక బస్సులు అందుబాటులో ఉంచుతారు. పోలీస్, రవాణా, మున్సిపల్ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ.. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా సంస్థ అన్ని చర్యలు తీసుకుంటోంది.” అని టీజీఎస్ఆర్టీసీ ఎండీ వీసీ సజ్జనర్ అన్నారు.


