Congress meeting by CM Revanth Reddy: సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన నేడు కీలక సమావేశం జరగనుంది. మంత్రులతో పాటు న్యాయ నిపుణులు సైతం ఈ సమావేశానికి హాజరుకానున్నారు. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల జీవోను సవాల్ చేస్తూ దాఖలైన పిటిషన్పై వినిపించాల్సిన వాదనలపై సీఎం సమీక్ష చేయనున్నట్లు తెలుస్తోంది. రేపు బీసీ రిజర్వేషన్లపై హైకోర్టులో విచారణ జరగనున్న నేపథ్యంలో సీఎం అధ్యక్షతన జరిగే ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది.
అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చ: అధికార పార్టీలో నేడు కీలక పరిణామాలు చోటు చేసుకోనుంది. ముఖ్యంగా బీసీ నేతల అత్యవసర సమావేశం ఈరోజు సాయంత్రం నాలుగు గంటలకు రేవంత్ అధ్యక్షతన జరగనుంది. రేపు హైకోర్టులో బీసీ రిజర్వేషన్ల కేసు విచారణకు రానుండటంతో ఈ సమావేశం ప్రాముఖ్యతను సంతరించుకుంది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్లపై న్యాయస్థానంలో దాఖలైన పిటిషన్పై రేపు వాదనలు జరగనున్న నేపథ్యంలో.. ఈ భేటీలో పార్టీ తరఫున తీసుకోవాల్సిన నిర్ణయాలు, అనుసరించాల్సిన వ్యూహాలపై ప్రధానంగా చర్చించనున్నట్లు తెలుస్తోంది. ఈ సమావేశంలో టీపీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్తో పాటు మంత్రులు వాకిటి శ్రీహరి, పొన్నం ప్రభాకర్, కొండా సురేఖ, బీసీ ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్యమైన బీసీ నాయకులు సైతం పాల్గొనే అవకాశం ఉంది.
అభ్యర్థిపై క్లారిటీ వచ్చే అవకాశం: ఇక ఇదే సమావేశంలో జూబ్లిహిల్స్ ఉపఎన్నిక ఇన్ఛార్జి మంత్రులతో పాటు కార్పోరేషన్ ఛైర్మన్లకు సైతం పాల్గొంటారు. వారికి రేవంత్ రెడ్డి జూబ్లిహిల్స్ ఉపఎన్నిక, స్థానిక సంస్థల ఎన్నికల గురించి దిశానిర్దేశం చేయనున్నట్లు సమాచారం. ఇక నేడే జూబ్లిహిల్స్ ఉపఎన్నికల కాంగ్రెస్ అభ్యర్థిపై కూడా ఓ క్లారిటీ వచ్చే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. సమర్థవంతమైన ప్రచార వ్యూహం లాంటి కీలక అంశాలపై నేతలు డిస్కస్ చేసే అవకాశం ఉంది. ఈ సమావేశంలోనే పార్టీ తలపెట్టిన మరో ముఖ్య కార్యక్రమం ‘బస్తీ బాట’ నిర్వహణ తేదీలను సైతం కాంగ్రెస్ పార్టీ ఖరారు చేయనున్నట్లు తెలుస్తుంది.
మోగిన ఎన్నికల నగారా: రాజకీయంగా ప్రాధాన్యత సంతరించుకున్న జూబ్లీ హిల్స్ శాసనసభ నియోజకవర్గ ఉప ఎన్నికకు నగారా మోగింది. దివంగత శాసనసభ్యులు మగంటి గోపీనాథ్ ఆకస్మిక మరణంతో ఖాళీ అయిన ఈ స్థానానికి నవంబర్ 11న పోలింగ్ నిర్వహించనున్నట్లు భారత ఎన్నికల సంఘం ప్రకటించింది. నవంబర్ 14న ఓట్ల లెక్కింపు జరగనుంది. ఈ నేపథ్యంలో అధికార, విపక్ష పార్టీలు వ్యూహ ప్రతివ్యూహాలతో కదనరంగానికి సిద్ధమవుతున్నాయి. అభ్యర్థుల ఎంపికపై తీవ్ర కసరత్తు చేస్తుండగా నియోజకవర్గంలో రాజకీయ వేడి రాజుకుంది.


