Blood Moon in sky: ఎన్నో రహస్యాలు… మరెన్నో వింతలకు నెలవు మన విశ్వం. విశ్వాంతరాళాల్లో మనిషి ఆశ్చర్యానికి గురైయ్యే ఎన్నో అద్భుతాలు జరుగుతూనే ఉంటాయి. ఎంత తెరచి చూసినా ఇంకా ఇంకా ..ఎన్నో వింతలను తనలో నింపుకుని మనిషిని నిత్యం ఆశ్చర్యంలో ఉండేలా మన విశ్వం చేస్తుంది. ఎప్పటికీ అర్థం కాని ఆ గగనవీధుల్లో మరొక అద్భుతం ఇవాళ ఆవిష్కృతం కానుంది.
చంద్రగ్రహణానికి గడియలు ముంచుకొస్తున్నాయి. అంతేకాకుండా ఆకాశంలో అద్భుత దృశ్యం ఆవిష్కృతం కానుంది. బ్లడ్మూన్గా పిలిచే ఈ తరహా చంద్రగ్రహణం గతంలో ఎప్పుడూ చూడలేదని ఖగోళవేత్తలు అంటున్నారు. ఇకపై ఎప్పుడు చూస్తామో ఊహించలేమని చెబుతున్నారు. అసలు ఈ బ్లడ్ మూన్ స్పెషాలిటీ ఏంటి.. మనం దీన్ని ఎన్ని గంటలకు చూడొచ్చు.. ఇంతకూ మన దేశంలో కనిపిస్తుందా అనే విషయాలను తెలుసుకుందాం!
ప్రపంచ వ్యాప్తంగా ఆవిష్కృతం: ఈరోజు గగనవీధులు అద్భుత దృశ్యానికి వేదిక కానుంది. చంద్రుడు ఎరుపు రంగులో ప్రకాశవంతంగా కనువిందు చేయబోతున్నాడు. దీన్ని బ్లడ్మూన్ గా పిలుస్తారని ఖగోళవేత్తలు పేర్కొన్నారు. ఇది ఒక సంపూర్ణ చంద్రగ్రహణమని తెలిపారు. ప్రపంచ వ్యాప్తంగా కోట్లాది మంది చూసే ఛాన్స్ ఉంటుందని అన్నారు. ఒకప్పుడు చంద్రగ్రహణాలు కొన్ని ప్రాంతాల్లో మాత్రమే కనిపించేవి.. కానీ వాతావరణం బాగుంటే ప్రపంచ వ్యాప్తంగా 85శాతం మంది ఈ బ్లడ్మూన్ ను చూసే అవకాశం ఉండనుంది.
Also Read: https://teluguprabha.net/telangana-news/telugu-states-temples-closed-lunar-eclipse/
భారత కాలమానం ప్రకారం: బ్లడ్మూన్ దాదాపు 82 నిమిషాల పాటు కొనసాగనుందని ఖగోళవేత్తలు తెలిపారు . భారత కాలమానం ప్రకారం చంద్రగ్రహణం రాత్రి 8 గంటల 58 నిమిషాలకు ప్రారంభమవుతుందని అన్నారు. ఆ తర్వాత రాత్రి 9 గంటల 57 నిమిషాల నుంచి స్పష్టంగా కనిపించనున్నట్లు శాస్త్రవేత్తలు తెలిపారు. అలాగే రాత్రి 11 గంటలకు సంపూర్ణ గ్రహణం మొదలవుతుందని అన్నారు. 11..41కి చంద్రుడు అత్యంత ఎర్రగా మారనున్నాడని తెలిపారు. రాత్రి 2 గంటల 25 నిమిషాలకు గ్రహణం పూర్తిగా ముగుస్తుందని సైంటిస్టులు తెలిపారు.
కాంతిలో స్పష్టత లోపం: చందమామ పూర్తి ఎరుపురంగులో ఉన్న దృశ్యాన్ని కన్నులారా వీక్షించాలంటే మాత్రం రాత్రి 11 నుంచి 12 గంటల 22 నిమిషాల మధ్య మెలుకువతో ఉండాల్సిందే. హైదరాబాద్, చెన్నై,బెంగళూరు, ముంబై, ఢిల్లీలో చంద్రగ్రహణం కనిపించనుంది. కానీ కాలుష్యం కారణంగా కాంతిలో స్పష్టత ఉండదని ఖగోళవేత్తలు తెలిపారు. హిమాచల్, లడాఖ్, రాజస్థాన్, కూర్గ్లో మాత్రం స్పష్టంగా కనిపిస్తుందని అన్నారు. ఎలాంటి ప్రత్యేక కళ్లద్దాలు, టెలిస్కోప్ లేకుండనే బ్లడ్మూన్ని స్పష్టంగా చూడవచ్చని అన్నారు.


