తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి ఏడాదిన్నర అయింది. అయితే ఇప్పటికీ మంత్రివర్గంలో ఆరు మంత్రి పదవులు భర్తీ కాలేదు. అదిగో ఇదిగో అంటున్నారు కానీ కేబినెట్(Cabinet)విస్తరణ మాత్రం జరగలేదు. సీఎం రేవంత్ రెడ్డి, డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, టీపీసీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్ చాలా సార్లు ఢిల్లీ వెళ్లి అధిష్టానం పెద్దలతో దీనిపై చర్చించారు. ఎప్పటికీ అప్పుడు ఈసారి విస్తరణ ఉంటుందనే ప్రచారం జరుగుతోంది. కానీ పెండింగ్ పడిపోతుంది. దీంతో ఆశావహులు ఇంకా ఎన్ని రోజులు అంటూ వాపోతున్నారు.
ఈ క్రమంలో మంత్రివర్గ విస్తరణపై పీపీసీ చీఫ్ మహేశ్ కుమార్ గౌడ్(Mahesh Kumar Goud)కీలక వ్యాఖ్యలు చేశారు. రాష్ట్ర కాంగ్రెస్ ఇంఛార్జ్ మీనాక్షి నటరాజన్ తో కలిసి మీడియాతో మాట్లాడారు. ఈ నెలలోనే మంత్రివర్గ విస్తరణ జరిగే అవకాశం ఉందని తెలిపారు. అయితే ఎమ్మెల్యేల పనితీరుపై ఆయన తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యేలు తమ పనితీరును బేరీజు వేసుకోవాలని సూచించారు. మెజార్టీ ఎమ్మెల్యేల పనితీరు సరిగా లేదన్నారు. సరిదిద్దుకోవాల్సిన బాధ్యత శాసనసభ్యులపై ఉందని స్పష్టం చేశారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో మెరుగైన ఫలితాల కోసం ఎమ్మెల్యేలు కృషి చేయాలని పిలుపునిచ్చారు.
పార్టీలో చిన్న చిన్న సమస్యలు ఉన్న మాట వాస్తవమే అన్నారు. ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నా ప్రభుత్వానికి రావాల్సిన ప్రచారం మాత్రం రావడం లేదని వాపోయారు. కార్యకర్తలు నిరాశగా ఉన్నారని చెప్పారు. పార్టీ సమర్ధవంతంగా ఉంటేనే మరోసారి అధికారంలోకి వచ్చే అవకాశం ఉంటుందని ఆయన తేల్చి చెప్పారు. మహేశ్ గౌడ్ వ్యాఖ్యలు పార్టీలో చర్చనీయాంశంగా మారాయి.