Trump Media Investments In Telangana: అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తెలంగాణకు బంపర్ ఆఫర్ ప్రకటించారు. ఆయనకు చెందిన ట్రంప్ మీడియా టెక్నాలజీస్ సంస్థ తెలంగాణలో భారీగా పెట్టుబడులు పెట్టనుంది. ఫ్యూచర్ సిటీలో నిర్వహిస్తున్న తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ వేదికగా ఆ సంస్థ డైరెక్టర్ ఎరిక్ కీలక ప్రకటన చేశారు. వచ్చే పదేళ్లలో తెలంగాణలో రూ.లక్ష కోట్ల మేర పెట్టుబడులు పెట్టనున్నట్లు తెలిపారు. ఫ్యూచర్ సిటీ పేరుతో కొత్త నగరాన్ని నిర్మించాలనే ఆలోచన అభినందనీయమని సీఐఐ మాజీ ఛైర్మన్ దినేశ్ స్పష్టం చేశారు. తెలంగాణ ఇప్పటికే శరవేగంగా అభివృద్ధి చెందుతున్న రాష్ట్రంగా ఉందని పేర్కొన్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి సంస్థలను ఒకే వేదిక మీదకు తీసుకురావడం అనేది గొప్ప విషయమన్నారు. తెలంగాణ విజన్లో తాము భాగస్వాములు అయ్యేందుకు రెడీగా ఉన్నామని తెలిపారు. ఇక, ఇక, ప్రపంచ కుబేరుల్లో ఒకరైన గౌతమ్ అదానీకి చెందిన అదానీ పోర్ట్స్ అండ్ సెజ్ ఎండీ కరణ్ అదానీ మాట్లాడుతూ.. తెలంగాణ విజన్ను ఈ సమ్మిట్ ప్రతిబింబిస్తోందని తెలిపారు. అదానీ గ్రూప్ ఇప్పటికే రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టిందని, సిమెంట్, గ్రీన్ డేటా సెంటర్స్, రెన్యువబుల్ ఎనర్జీలో పెట్టుబడులు పెడుతున్నామని తెలిపారు. డిఫెన్స్, ఏరోస్పేస్ పార్క్ను కూడా ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. అంతేకాదు, దేశంలోనే తొలిసారిగా యూఏవీ టెక్నాలజీని హైదరాబాద్లో రూపొందిస్తున్నామని, హైదరాబాద్లో తయారయ్యే యూఏవీలను దేశ సైన్యానికి అందిస్తామని తెలిపారు. హైదరాబాద్లో తయారయ్యే యూఏవీలను ప్రపంచ మార్కెట్లో కూడా అమ్ముతామన్నారు. కాగా, ఓవైపు, ట్రంప్, మరోవైపు అదానికి చెందిన అంతర్జాతీయ సంస్థల నుండి రాష్ట్రానికి భారీగా పెట్టుబడులు రాబోతుండటం శుభ పరిణామంగా చెప్పవచ్చు. ముఖ్యంగా, ట్రంప్ గ్రూప్, అదానీ గ్రూప్ వంటి దిగ్గజ సంస్థలు హైదరాబాద్లో భారీ ప్రాజెక్టుల నిర్మాణానికి ముందుకు రావడం తెలంగాణకు ఆహ్వానించదగ్గ పరిణామం. ఈ రెండు భారీ పెట్టుబడుల ప్రకటనలు తెలంగాణ రాష్ట్రంలో పారిశ్రామిక వాతావరణం, ప్రభుత్వ విధానాలు అంతర్జాతీయ పెట్టుబడిదారులను ఆకర్షిస్తున్నాయని స్పష్టం చేస్తున్నాయి. త్వరలో ఈ ప్రాజెక్టులు కార్యరూపం దాల్చి, రాష్ట్ర ఆర్థిక ప్రగతికి కొత్త ఊపునిస్తాయని నిపుణులు అంచనా వేస్తున్నారు.
రూ.25 వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్డేటా సెంటర్..
తెలంగాణలో రూ.25 వేల కోట్లతో 48 మెగావాట్ల గ్రీన్డేటా సెంటర్ను ఏర్పాటు చేస్తామని, లాజిస్టిక్స్లో కూడా రాష్ట్రాన్ని మొదటిస్థానంలో నిలిపేందుకు అదానీ సంస్థ యత్నిస్తున్నట్లు పేర్కొన్నారు. రూ.4 వేల కోట్లతో రహదారి సౌకర్యాలు కల్పిస్తామని చెప్పారు. అలాగే జిల్లాలను కలిపే రహదారులను కూడా అదానీ సంస్థ నిర్మిస్తున్నట్లు వెల్లడించారు. రూ.2 వేల కోట్లతో సిమెంట్ పరిశ్రమ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు.

