Telangana Weather Report: తెలంగాణ ప్రజలకు చల్లటి కబురు అందించారు వాతావరణ శాఖ అధికారులు. రానున్న ఐదు రోజుల పాటు వర్షాలు కురుస్తాయని తెలిపారు. నైరుతి రుతుపవనాలు రాకతో పాటు బంగాళాఖాతంలోని ఉపరితల ఆవర్తన ప్రభావతంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపారు. ఈనేపథ్యంలో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో ఈదురు గాలులు వీచే అవకాశం ఉందన్నారు.
మెదక్, వికారాబాద్, రంగారెడ్డి, ములుగు, కామారెడ్డి, ఆదిలాబాద్, మహబూబ్నగర్, యాదాద్రి, హైదరాబాద్, నిజామాబాద్, మేడ్చల్, సంగారెడ్డి, కొత్తగూడెం, రాజన్న సిరిసిల్ల, సిద్ధిపేట, భూపాలపల్లి, కరీంనగర్ జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ జారీ చేసింది. భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో ప్రజలంతా జాగ్రత్తగా ఉండాలని సూచించింది. వ్యవసాయ పనుల నిమిత్తం పొలాలకు వేళ్లే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించింది.
ఇదిలా ఉంటే గతంలో కంటే ఈసారి నైరుతి రుతుపవనాలు మే నెల చివరి వారంలోనే రాష్ట్రంలోకి ప్రవేశించాయి. దీంతో ఈసారి పెద్ద ఎత్తున వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అంచనా వేసింది. అయితే జూన్ నెల మొదలైన నాటి నుంచి వర్షాలు పడటం లేదు. తొలకరి జల్లు సందర్భంగా రైతులు దుక్కి దున్ని వ్యవసాయం చేసేందుకు సిద్ధమయ్యారు. కానీ వరుణుడు కరుణించలేదు. ఎండాకాలంలో వానలతో ఉక్కపోత నుంచి ఉపశమనం కలిగించాడు. ఇప్పుడు వానకాలంలో మాత్రం జాడే లేకుండా పోయాడు. దీంతో రైతులు వాన జల్లుల కోసం కళ్లు కాయలు కాసేలా ఎదురుచూస్తున్నారు.
ఇలాంటి తరుణంలో వాతావరణ శాఖ అధికారులు శుభవార్త అందించారు. వచ్చే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురుస్తాయని తెలిపారు. పలు జిల్లాలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు కురుస్తాయని వెల్లడించారు. ఉత్తర, దక్షిణ తెలంగాణలోని పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. రెండు రోజుల పాటు అన్ని జిల్లాల్లో గంటకు 40-50 కిలోమీటర్ల వేగంతో బలమైన ఈదురు గాలులు వీచే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరించారు.