తెలంగాణలోని పలు జిల్లాల్లో వాతావరణం చల్లబడింది. ఆదిలాబాద్, జనగాం, మహబూబ్ నగర్, నాగర్ కర్నూల్, నల్గొండ, నిర్మల్, నిజామాబాద్, రంగారెడ్డి, సూర్యాపేట, వికారాబాద్, భువనగిరి జిల్లాల్లో లికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిసే అవకాశం ఉంది. ఈమేరకు వాతావరణ శాఖ(Weather Report) ఎల్లో అలర్ట్ జారీ చేసింది.
ఇక సోమవారం, మంగళవారం రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో తేలికపాటి నుండి మోస్తారు వర్షాలు కొన్నిచోట్ల కురుస్తాయని తెలిపింది. వచ్చే 3 రోజుల్లో కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని.. ఈరోజు, రేపు, ఎల్లుండి రాష్ట్రంలోని అన్ని జిల్లాలలో గంటకు 30 నుంచి 40 కిలోమీటర్ల వేగం కలిగిన ఈదురు గాలులు వీస్తాయిని పేర్కొంది.
అలాగే హైదరాబాద్ సిటీలోని పలు ప్రాంతాల్లో వర్షం కురిసే అవకాశం ఉంది. నగరంలో నాలుగు రోజులపాటు భారీ వర్షాలు కురిసే చాన్స్ ఉన్నట్లు వాతావరణ శాఖ హెచ్చరికలు జారీ చేసింది. ఈ మేరకు జూన్ 8 నుంచి 11 వరకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. కాగా శనివారం సాయంత్రం అత్యధికంగా టోలిచౌకీలో 2.10 సెంటిమీటర్లు, బంజారాహిల్స్ 1.60, ఆసీఫ్ నగర్లో 1.35 సెంటిమీటర్ల వర్షం పడింది.
అటు ఏపీలోనూ వర్షాలు పడే అవకాశం ఉంది. తూర్పు విదర్భ నుంచి ఉత్తర అంతర్గత కర్నాటక వరకు సగటు సముద్రమట్టానికి 1.5 కి మీ ఎత్తులో ద్రోణి ఏర్పడింది. దీని కారణంగా వచ్చే మూడు రోజుల పాటు తేలికపాటి నుండి ఒక మోస్తరు వర్షాలు లేదా ఉరుములతో కూడిన జల్లులు ఒకటి లేదా రెండు చోట్ల కురిసే అవకాశముంది. ఉరుములతో కూడిన మెరుపులు, బలమైన ఈదురు గాలులు గంటకు 40-50 కి.మీ. వేగంతో వీచే అవకాశం ఉంది.