Maoists Surrender: అగ్రనేతల ఎన్కౌంటర్లతో మావోయిస్ట్ పార్టీకి కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆపరేషన్ కగార్తో మావోయిజం ఒడిదుడుకులకు లోనవుతున్న వేళ.. మావోయిస్టులు ఆయుధాలు వీడి జన స్రవంతిలో కలుస్తున్నారు. ఈ క్రమంలో ఇవాళ తెలంగాణ డీజీపీ శివధర్ రెడ్డి ఎదుట భారీ సంఖ్యలో మావోయిస్టులు లొంగిపోయారు.
మొత్తం 37 మంది మావోయిస్టులు లొంగిపోగా.. వారిలో ముగ్గురు రాష్ట్ర కమిటీ సభ్యులు, 25 మంది మహిళలు ఉన్నట్లు డీజీపీ మీడియాతో వివరాలు వెల్లడించారు. మావోయిస్టు అగ్రనేతలు ఆజాద్, నారాయణ, ఎర్రాలు తదితరులు ఉన్నారు. లొంగిపోయిన అనంతరం మావోలు తమ వద్దనున్న ఆయుధాలను పోలీసులకు అందజేశారు. వాటిలో 303 రైఫిల్స్, జీ3 రైఫిల్స్, ఏకే47లు, ఎస్ఎల్ఆర్, బుల్లెట్స్, క్యాట్రేజ్ సీజ్ తదితర మారణాయుధాలు ఉన్నట్లు పోలీసులు తెలిపారు.
అనంతరం మీడియాతో డీజీపీ శివధర్ రెడ్డి మాట్లాడారు. ఈ 37 మంది మావోయిస్టులలో 34 మంది ఛత్తీస్గఢ్కి చెందిన వారు ఉన్నారని చెప్పారు. లొంగిపోయిన వారికి రివార్డులు, నగదుతో పాటు ప్రోత్సాహక వెసులుబాటు కల్పిస్తామని డీజీపీ పేర్కొన్నారు. వారిపై రూ. 1.41 కోట్ల రివార్డు ఉందని ఆ మొత్తాన్ని వారికే అందజేస్తామని తెలిపారు. మిగతా వారు కూడా త్వరగా లొంగిపోవాలని డీజీపీ సూచించారు.
‘అక్టోబర్ 21 పోలీసు అమరవీరుల దినోత్సవం సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి పిలుపుమేరకు మావోలు ఆయుధాలు వీడి జనస్రవంతిలో కలుస్తున్నారు. లొంగిపోయిన మావోయిస్టులకు ఎలాంటి సమస్య లేకుండా చూస్తామని సీఎం రేవంత్ హామీ ఇచ్చారు. అందులో భాగంగానే వారిలో మార్పు వచ్చింది. ఆయుధాలను అప్పగించి జనంలో కలుస్తున్నారు.’ అని డీజీపీ వెల్లడించారు.
కాగా, కొన్ని రోజుల క్రితం కీలక నేత హిడ్మా ఏపీలోని అల్లూరి సీతారామరాజు జిల్లాలో ఎన్కౌంటర్లో మృతి చెందిన విషయం తెలిసిందే. మావోల ఏరివేత లక్ష్యంగా కేంద్రం చేపట్టిన ఆపరేషన్ కగార్.. గత కొంతకాలంగా మావోయిస్టుల ఉనికిని ప్రశ్నార్థకంగా మార్చింది. కీలక నేతలైన చలపతి, బాలకృష్ణ, గణేశ్, రామచంద్రారెడ్డి, సత్యనారాయణ రెడ్డి, హిడ్మా ఎన్కౌంటర్లలో మృతి చెందడంతో మావోయిజంలో అలజడి మొదలైంది. పలువురు అనారోగ్యం కారణంగా ఆయుధాలను వీడగా.. మరికొందరు పోలీసుల ఎదుట లొంగిపోయారు.

