Telangana Rising 2047:స్విట్జర్లాండ్లోని దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక వేదిక (WEF) వార్షిక సదస్సు 2026 వేదికగా ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకుంది. సీఎం రేవంత్రెడ్డిని ప్రముఖ నటుడు చిరంజీవి కలుసుకున్నారు. సీఎం ఆహ్వానం మేరకు చిరంజీవి ప్రపంచ ఆర్థిక సదస్సుకు హాజరయ్యారు.
సీఎం ఆహ్వానం మేరకు హాజరైన చిరంజీవి: దావోస్లో జరుగుతున్న ప్రపంచ ఆర్థిక సదస్సులో తెలంగాణ సీఎం రేవంత్రెడ్డిని ప్రముఖ నటుడు చిరంజీవి కలుసుకున్నారు. చిరంజీవి స్విట్జర్లాండ్లోనే ఉన్నట్లు తెలుసుకున్న రేవంత్ రెడ్డి.. ఆయనను ప్రపంచ ఆర్థిక సదస్సుకు ఆహ్వానించారు. దీంతో చిరంజీవి ఆ సదస్సుకు హాజరయ్యారు. “తెలంగాణ రైజింగ్ 2047” విజన్ డాక్యుమెంట్ను ప్రత్యక్షంగా సీఎంతో కలసి వీక్షించారు. ఇటీవల కుటుంబ సభ్యులతో కలిసి ‘మన శంకరవరప్రసాద్ గారు’ సినిమాను వీక్షించానని, ఎంతో ఆస్వాదించినట్లు చిరంజీవితో సీఎం తెలిపారు. చిరంజీవి తన కుటుంబ సభ్యులతో కలిసి విహారయాత్ర నిమిత్తం స్విట్జర్లాండ్ వెళ్లారు. అయితే ఈ సమయంలోనే దావోస్లో ప్రపంచ ఆర్థిక సదస్సు జరుగుతుండటంతో సీఎం రేవంత్రెడ్డి.. చిరంజీవిని అక్కడికి ఆహ్వానించారు.
Also read-Medaram: మేడారంలో నేడు కీలక ఘట్టం.. గిరిజన ఆచారాలతో అష్టదిగ్బంధనం!
సీఎం రేవంత్ రెడ్డి వినూత్న ప్రతిపాదన: వరల్డ్ ఎకనామిక్ ఫోరమ్ (WEF) సదస్సులో తెలంగాణ సీఎం వినూత్న ప్రతిపాదన ఉంచారు. ప్రతి సంవత్సరం జూలై – ఆగస్టు నెలల్లో హైదరాబాద్లో “మినీ దావోస్” తరహాలో ఫోరమ్ ఫాలో-అప్ సదస్సు (Forum follow-up conference)ను నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి సూచించారు. పెట్టుబడి ఒప్పందాలు, వాణిజ్య నిర్ణయాలకు ఏడాది కాలం చాలా ఎక్కువని ఈ సందర్భంగా అన్నారు. అందుకే ఆరు నెలలకోసారి సమీక్షా సమావేశం అవసరమని సీఎం రేవంత్ అభిప్రాయపడ్డారు. ఈ ప్రతిపాదనకు గ్లోబల్ బిజినెస్ లీడర్లు, పాలసీ నిర్ణేతలు ఏకగ్రీవంగా మద్దతు పలికారు.

