Actor Manchu Manoj Started Trust: ప్రముఖ సినీ నటుడు మంచు మనోజ్ మంచి మనసు చాటుకున్నారు. సేవా కార్యక్రమాల్లో ముందుంటూ, సామాజిక సమస్యలపై స్పందించే మనోజ్ తాజాగా మరో గొప్ప నిర్ణయం తీసుకున్నారు. తన సేవా కార్యక్రమాలను మరింత విస్తరించేందుకు ఐక్య పేరిట ఒక కొత్త ట్రస్ట్ను ప్రారంభించారు. ఆదివారం ట్రస్ట్ లోగో ఆవిష్కరణ సందర్భంగా నిర్వహించిన కార్యక్రమంలో జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ చేతుల మీదుగా ట్రస్ట్ లోగోను ఆవిష్కరించారు. ‘ఐక్య ధైర్య సేనా సమితి’ అని పేరు పెట్టినట్లు తెలిపారు. ఈ ట్రస్ట్ ద్వారా రక్తదానం, చిన్నారుల దత్తత సహా పలు సేవా కార్యక్రమాలు చేయనున్నారని తెలియజేశారు. ఇంతటి గొప్ప నిర్ణయం తీసుకున్న మంచు మనోజ్, ఆయన భార్య మౌనికను ఎమ్మెల్యే నవీన్ యాదవ్ అభినందించారు. వారికి తన మద్దతు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు.
Also read: Congress office: కాంగ్రెస్ ఆఫీసులో ఆసక్తికర ఘటన.. లవ్ యూ అని రాసి వెళ్లిన దొంగలు..!
ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకోనున్న మనోజ్..
కాగా, మే 20న తన పుట్టినరోజు సందర్భంగా మంచు మనోజ్ ట్రస్ట్ కార్యక్రమాలను ప్రారంభించనున్నారు. ఈ సందర్భంగా మంచు మనోజ్ మాట్లాడుతూ.. “ట్రస్టు ఏర్పాటు చేయాలనేది నా సతీమణి ఆలోచన. సేవా కార్యక్రమాల్లో మేం ముందుంటామని మీకు తెలుసు. ఇతరులకు సాయం చేయాలన్నది నేను, మౌనిక మా పెద్దల నుంచి నేర్చుకున్నాం. పదిమందికి సేవా చేయాలని ముందుకొచ్చే వారికి ఓ వేదికగా ఐక్య ధైర్య సేనా సమితిని ప్రారంభించాం. మేం ఐదుగురు చిన్నారులను దత్తత తీసుకుని, వారిని బాగా చదివించాలనుకుంటున్నాం. తెలుగు రాష్ట్రాల్లో ఈ సేవా కార్యక్రమాలను ఇంకా విస్తరించే ఆలోచనలో ఉన్నాం. ఆపన్నహస్తం కోసం ఎదురు చూసే ప్రతి ఒక్కరికీ ఉపయోగపడినప్పుడే ఈ ట్రస్ట్ విజయవంతమవుతుంది. దానికి మీ అందరి సహకారం ఉండాలని కోరుకుంటున్నాం’’ అని ఆయన పేర్కొన్నారు.

