Addanki Dayakar: గత ప్రభుత్వ హయాంలో జరిగిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారంలో సిట్ అధికారులు దర్యాప్తును ముమ్మరం చేయడంపై ఎమ్మెల్సీ అద్దంకి దయాకర్ హర్షం వ్యక్తం చేశారు. కేసీఆర్కు నోటీసులు అందడంపై స్పందిస్తూ ఆయన కల్వకుంట్ల కుటుంబంపై విమర్శనాస్త్రాలు సంధించారు.భారత రాజ్యాంగ పరిధిలో పని చేయాల్సిన వ్యక్తులు, రాజ్యాంగాన్ని అమలు చేస్తూ పరిపాలించాల్సిన వ్యక్తులు ఇలాంటి నీతిభాహ్యమైన పద్దతులు మంచివికావని అన్నారు.ఈ కేసు దేశం మొత్తానికి ఒక దిక్సూచిగా ఉండాలనే ఉద్దేశ్యంతోనే సీఎం రేవంత్ రెడ్డి సర్కార్ .. ఫోన్ ట్యాపింగ్ వ్యవహారాన్ని సీరియస్గా తీసుకుందని అన్నారు. అందుకే చట్టం తనపని తాను చేసుకుపోతుందని తెలిపారు.
చట్టం తన పని తాను చేస్తుంది: తప్పు చేసిన వారు ఎవరైనా సరే చట్టానికి సమాధానం చెప్పాల్సిందని ఎమ్మెల్సీ అద్దంకి అన్నారు. పదవిలో ఉన్నా లేకపోయినా రాజ్యాంగం ముందు అందరూ సమానులే. ఫోన్ ట్యాపింగ్ వంటి అరాచకాలకు పాల్పడితే శిక్ష తప్పదఅని ఆయన హెచ్చరించారు.కేసీఆర్ కుటుంబం పదేళ్ల పాలనలో తెలంగాణను దోచుకుందని అన్నారు. కేవలం ఆర్థిక అవినీతి మాత్రమే కాకుండా ఫోన్ ట్యాపింగ్ ద్వారా పౌరుల స్వేచ్ఛను గత పాలకులు హరించారని అద్దంకి మండిపడ్డారు.
Also read-Phone Tapping : ఫామ్హౌస్ గడపకు ‘సిట్’! ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు నోటీసులు..
పారదర్శకంగా దర్యాప్తు: బీఆర్ఎస్ నేతలు చేస్తున్న నిరసనలపై స్పందిస్తూ విచారణ సంస్థలు నోటీసులు ఇస్తే సహకరించాలి తప్ప.. వాటిని రాజకీయ కక్షసాధింపుగా చిత్రీకరించడం సరికాదన్నారు. తప్పు చేయకపోతే విచారణకు సహకరించాలని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా దర్యాప్తు చేస్తోందని అన్నారు. ఏ ఒక్కరినీ అన్యాయంగా ఇరికించే ఉద్దేశం తమ ప్రభుత్వానికి లేదని తెలిపారు. కేవలం నిజాలు బయటకు రావాలన్నదే తమ లక్ష్యమని ఆయన స్పష్టం చేశారు.


