Bhujanga Rao: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో కీలక నిందితుడై సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీ భుజంగరావుకు అవినీతి నిరోధక శాఖ(ఏసీబీ) ప్రత్యేక కోర్టు 14 రోజుల రిమాండ్ విధించింది. దీంతో అతన్ని చంచల్గూడ జైలుకు తరలించారు.
15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు: భుజంగరావు భారీగా ఆక్రమ ఆస్తులు కూడబెట్టారనే ఫిర్యాదులు, ఆరోపణలు ఎప్పటి నుంచో ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఏసీబీ అధికారులు ప్రాథమిక ఆధారాలతో బుధవారం ఉదయం నుంచే రంగంలోకి దిగారు. భుజంగరావు స్వగృహంతో పాటు ఆయన బంధువులు, అత్యంత ఆప్తులు, కుటుంబ సభ్యుల నివాసాలపై అధికారులు విరుచుకుపడ్డారు. మొత్తం 15 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించారు. ఆయనకు చెందిన ఆస్తులను పెద్ద ఎత్తున గుర్తించారు. సదరు ఆస్తులకు లెక్కలు చూపకపోవడంతో భుజంగరావును ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు.
Also read-ACB: సస్పెండెడ్ అడిషనల్ ఎస్పీ భుజంగరావు ఇళ్లపై ఏసీబీ మెరుపు దాడులు!
రెండేళ్ల క్రితమే అరెస్ట్: ఫోన్ అక్రమ ట్యాపింగ్ కేసులో భుజంగరావు సుమారు రెండేళ్ల క్రితమే అరెస్ట్ అయినప్పటికీ.. బెయిల్పై విడుదలయ్యారు. అయితే అక్రమాస్తుల నేపథ్యంలో ఏసీబీ మళ్లీ అరెస్ట్ చేసింది. ఏసీబీ సోదాల్లో సుమారు రూ.5.92 కోట్ల(రిజిస్ట్రేషన్ విలువ ప్రకారం) విలువైన చర, స్థిరాస్తుల్ని ఏసీపీ అధికారులు గుర్తించినట్లుగా తెలుస్తోంది. ఫోన్ ట్యాపింగ్ కేసు విచారణ ఎదుర్కొంటున్న తరుణంలో.. ఇప్పుడు ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో భుజంగరావును ఏసీబీ అరెస్ట్ చేయడంతో.. పోలీసు వర్గాలతో పాటు రాజకీయంగానూ తీవ్ర కలకలం రేపుతోంది. ఫోన్ ట్యాపింగ్ నెపంతో సాగిన అక్రమ వసూళ్లు, సెటిల్మెంట్లతో ఏమైనా ఆస్తులు కూడబెట్టారా? అనే కోణంలోనూ అధికారులు ఆరా తీస్తున్నట్లు సమాచారం.

