Balka Suman Bail Petition Hearing: మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో క్యాతనపల్లిలో జరిగిన ఘర్షణల నేపథ్యంలో ఇప్పటికే బీఆర్ఎస్ మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ జైలులో ఉన్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో ఆయన దాఖలు చేసిన బెయిల్ పిటిషన్పై నేడు మరోసారి మంచిర్యాల కోర్టులో విచారణ జరిగింది. కాగా, విచారణ మరోసారి వాయిదా పడటంతో బాల్క సుమన్కు నిరాశ ఎదురైంది.
Also Read: https://teluguprabha.net/telangana/telangana-plans-scooters-and-scholarships-for-inter-students/
మంచిర్యాల జిల్లా చెన్నూరు మాజీ ఎమ్మెల్యే, బీఆర్ఎస్ నేత బాల్క సుమన్కు ఈ రోజు కూడా కోర్టులో చుక్కెదురైంది. క్యాతనపల్లి మున్సిపాలిటీ వర్గం ఎన్నిక సమయంలో బీఆర్ఎస్, కాంగ్రెస్ నేతల మధ్య చోటుచేసుకున్న ఘర్షణ నేపథ్యంలో పోలీసులు బాల్క సుమన్ను అరెస్ట్ చేశారు. ప్రస్తుత ఆయన రిమాండ్లో ఉన్నారు. కాగా, ఆయన దాఖలు చేసుకున్న బెయిల్ పిటిషన్పై జిల్లా కోర్టులో ఈరోజు కూడా వాదనలు జరిగాయి. అయితే, పోలీసుల తరపున దాఖలైన కస్టడీ పిటిషన్ ఇంకా పెండింగ్లో ఉంది. దీంతో బెయిల్ వ్యవహారంపై తదుపరి విచారణను కోర్టు రేపటికి వాయిదా వేసింది. మరోవైపు లంచ్ మోషన్ అనంతరం కస్టడీ పిటిషన్పై కోర్టు నిర్ణయం తీసుకోనుంది.
ఈ క్రమంలో కోర్టులో బాల్క సుమన్ తరపున న్యాయవాది లలిత గట్టి వాదనలు వినిపించారు. రాజకీయ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే పోలీసులు అక్రమ కేసులు బనాయించారని ఆమె కోర్టుకి వివరించారు. అరెస్టు ప్రక్రియలో సుప్రీంకోర్టు నిర్దేశించిన మార్గదర్శకాలను పోలీసులు పూర్తిగా గాలికి వదిలేశారని ఆరోపించారు. క్యాతనపల్లి మున్సిపాలిటీ ఎన్నికల సమయంలో ప్రభుత్వం అధికార బలంతో ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసిందని.. కావాలనే బీఆర్ఎస్ నేతలను జైలు పాలు చేసిందని మండిపడ్డారు.
కాగా, కేసు దర్యాప్తులో భాగంగా నిందితుడిని విచారించాల్సిన అవసరం ఉందని కోర్టులో పోలీసులు పేర్కొన్నారు. ఈ మేరకు కస్టడీకి ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. క్యాతనపల్లి ఉదంతంలో బాల్క సుమన్ పాత్రపై మరింత లోతైన విచారణ జరపాల్సి ఉందని కోర్టుకు వివరించారు. ఈ క్రమంలో వాదనలు విన్న న్యాయస్థానం బెయిల్ పిటిషన్పై విచారణను రేపటికి వాయిదా వేసింది.

