Bandi Bhageerath POCSO case regular bail : రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన బండి భగీరథ్ పోక్సో (POCSO) కేసు వ్యవహారం అనూహ్య మలుపులు తిరుగుతోంది. ముందస్తు బెయిల్ వస్తుందన్న ఆశతో ఎదురుచూస్తున్న తరుణంలోనే.. పోలీసుల ఆకస్మిక అరెస్టుతో సీన్ మొత్తం ఒక్కసారిగా మారిపోయింది. అప్పటివరకు సాగిన న్యాయపోరాటం నీరుగారిపోగా, తాజాగా హైకోర్టులో ఈ కేసుకు సంబంధించి కీలక పరిణామం చోటుచేసుకుంది. ముందస్తు బెయిల్ పిటిషన్ను న్యాయస్థానం అనుమతితో భగీరథ్ తరఫు న్యాయవాదులు వెనక్కి తీసుకున్నారు. అసలు పిటిషన్ను ఎందుకు ఉపసంహరించుకోవాల్సి వచ్చింది? ముందస్తు బెయిల్ పిటిషన్పై తీర్పు రిజర్వ్ అయిన తర్వాత చోటుచేసుకున్న నాటకీయ పరిణామాలేంటి? ఇక తదుపరి న్యాయపరమైన అడుగులు ఎలా ఉండబోతున్నాయి?
అరెస్టుతో నిరర్థకమైన ముందస్తు బెయిల్ : పోక్సో కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న బండి భగీరథ్, ముందు జాగ్రత్త చర్యగా హైకోర్టులో ముందస్తు (Anticipatory) బెయిల్ పిటిషన్ దాఖలు చేసిన విషయం తెలిసిందే. దీనిపై ఈ నెల 15వ తేదీన ఉన్నత న్యాయస్థానం సుదీర్ఘంగా ఇరు పక్షాల వాదనలు విన్నది. వాదనలు ముగిసిన అనంతరం న్యాయమూర్తి తీర్పును రిజర్వులో ఉంచారు. అయితే, తీర్పు వెలువడక ముందే ఊహించని విధంగా ఈ నెల 16వ తేదీన భగీరథ్ను పోలీసులు అరెస్టు చేసి, న్యాయమూర్తి ముందు హాజరుపరిచి రిమాండ్కు తరలించారు. చట్టప్రకారం.. ఒక వ్యక్తి అరెస్టయి రిమాండ్కు వెళ్లిన తర్వాత, అంతకుముందు దాఖలు చేసిన ముందస్తు బెయిల్ పిటిషన్కు చట్టపరమైన విలువ ఉండదు (Infructuous). ఆ పిటిషన్ కాలగర్భంలో కలిసిపోయినట్లే లెక్క.
హైకోర్టులో న్యాయవాదుల విజ్ఞప్తి.. రెగ్యులర్ బెయిల్కు గ్రీన్ సిగ్నల్ : తాజాగా ఈ కేసు హైకోర్టులో విచారణకు రాగా.. భగీరథ్ తరఫు న్యాయవాదులు కోర్టుకు కీలక విషయాన్ని నివేదించారు. పిటిషనర్ను పోలీసులు ఇప్పటికే అరెస్టు చేసినందున, ఇక ముందస్తు బెయిల్ పిటిషన్తో ఎలాంటి ప్రయోజనం లేదని, దానిని ఉపసంహరించుకునేందుకు అనుమతివ్వాలని కోరారు. ఈ విజ్ఞప్తిని న్యాయస్థానం సానుకూలంగా పరిగణనలోకి తీసుకుంది. ముందస్తు బెయిల్ ఉపసంహరణకు అంగీకరించిన హైకోర్టు.. కింది కోర్టులో రెగ్యులర్ బెయిల్ దాఖలు చేసుకునేందుకు భగీరథ్కు అధికారికంగా అనుమతి మంజూరు చేసింది. దీంతో భగీరథ్ న్యాయవాదులు రెగ్యులర్ బెయిల్ కోసం దరఖాస్తు చేసుకునేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు.
కేసు పూర్వాపరాలు : సైబరాబాద్ పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పేట్బషీరాబాద్ పోలీస్ స్టేషన్లో బండి భగీరథ్పై ఈ నెల 8వ తేదీన పోక్సో (ప్రొటెక్షన్ ఆఫ్ చిల్డ్రన్ ఫ్రమ్ సెక్సువల్ అఫెన్సెస్) చట్టం కింద కేసు నమోదైంది. ఓ మైనర్ బాలిక పట్ల అసభ్యంగా ప్రవర్తించారని ఆరోపిస్తూ సదరు బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేశారు. తీవ్రమైన సెక్షన్లు కావడంతో పోలీసులు వెంటనే దర్యాప్తును వేగవంతం చేశారు. ఈ పరిణామాల నేపథ్యంలోనే భగీరథ్ న్యాయపోరాటం ప్రారంభించారు.

