Bandi Sanjay lashes out at the state government: రాష్ట్రంలో హిందూ పండుగలు, ఉత్సవాల నిర్వహణ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహిస్తోందని, హిందూ పండుగల పట్ల పక్షపాతం చూపిస్తోందని కేంద్ర మంత్రి, బీజేపీ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. హిందూ ఉత్సవాల నిర్వహణకు కావాల్సిన నిధుల కోసం హిందువులు బిచ్చమెత్తుకునే దుస్థితి రాష్ట్రంలో నెలకొందని కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇవాళ ఆయన సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి అమ్మవారిని దర్శించుకున్న అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. ”రంజాన్ పండుగ నిర్వహణ కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ.33 కోట్లు కేటాయించింది. అయితే, 80 శాతానికి పైగా ఉన్న హిందువులు నిర్వహించుకునే బోనాల ఉత్సవాలకు మాత్రం కేవలం రూ. 20 కోట్లు కేటాయించడాన్ని చూస్తుంటే హిందువుల పట్ల ఉన్న చిత్తశుద్ధి అర్ధమవుతోంది. జంట నగరాల్లోని 3 వేలకు పైగా దేవాలయాల్లో బోనాలు ఘనంగా జరుగుతుంటే, ప్రభుత్వం ఇచ్చిన అరకొర నిధులు ఏ మూలకు సరిపోతాయి. బోనాలను రాష్ట్ర పండుగగా ప్రకటించి నిధులు మాత్రం కేటాయించడం లేదు.” అని బండి సంజయ్ మండిపడ్డారు.
Also Read: Congress : చందాల చోరీ.. రాముడి పేరిట రచ్చ! బీజేపీపై కాంగ్రెస్ తీవ్ర ధ్వజం
హిందువుల పండుగలపై ఎందుకీ నిర్ణక్ష్యం..
ఆలయ ప్రాంగణంలో తీవ్రమైన ఎండలో గంటల తరబడి క్యూలైన్లలో నిలబడే భక్తులకు కనీసం తాగునీటి సౌకర్యం కూడా కల్పించకపోవడం శోచనీయమని బండి సంజయ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీఎం, మంత్రులు వచ్చి కేవలం దర్శనం చేసుకుని వెళ్లిపోతే సరిపోదని, భక్తుల ఇబ్బందులను పట్టించుకోవాల్సిన బాధ్యత వారిపై ఉందని గుర్తు చేశారు. కాంగ్రెస్ అంటేనే ముస్లిం… ముస్లిం అంటేనే కాంగ్రెస్ అని మరోసారి నిరూపితమైందన్నారు. హిందూ పండుగల పట్ల కాంగ్రెస్కు ఉన్న చులకన భావానికి ఇది నిదర్శనమని విమర్శించారు. బీఆర్ఎస్ ప్రభుత్వంలోనూ బోనాల ఉత్సవాలకు నిధుల కేటాయింపులో తీవ్ర నిర్లక్ష్యం జరిగిందని గుర్తుచేశారు. ముందుముందు రాబోయే గణేష్ ఉత్సవాలతో పాటు అన్ని హిందూ పండుగలకు రాష్ట్ర ప్రభుత్వం జనాభా నిష్పత్తి ప్రాతిపదికన నిధులను కేటాయించాలని డిమాండ్ చేశారు. ఉత్సవాల నిర్వహణలో తమ హక్కులను కాపాడుకోవడానికి, ఆత్మగౌరవాన్ని చాటుకోవడానికి హిందూ సమాజమంతా ఏకమై ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాల్సిన సమయం వచ్చిందని పిలుపునిచ్చారు.

