Bandi Sanjay makes serious allegations on KTR: రాష్ట్రంలో బీఆర్ఎస్ ప్రభుత్వాన్ని గద్దె దించడంలో బీజేపీ పోరాటమే కీలక పాత్ర పోషించిందని కేంద్ర మంత్రి బండి సంజయ్ అన్నారు. ఇప్పుడు ఆ కక్షతోనే గులాబీ నేతలు తన పదవి పోవాలని కోరుకుంటున్నారని మండిపడ్డారు. ఇవాళ ఆయన హైదరాబాద్లో మీడియాతో మాట్లాడుతూ.. కేసీఆర్ కుట్రలో భాగంగానే తప్పుడు ప్రచారాలు చేస్తున్నారని ఆరోపించారు. గత ఎన్నికల్లో ఒక్క ఎంపీ స్థానాన్ని కూడా గెలుచుకోని బీఆర్ఎస్ పార్టీకి మోదీ గురించి మాట్లాడే అర్హత లేదన్నారు. బీఆర్ఎస్ పార్టీ దయాదాక్షిణ్యాలపై మోదీ ప్రభుత్వం నడవడం లేదని కామెంట్ చేశారు. ఇక కేటీఆర్ ఓ ‘ఫేక్ మీడియా ఫ్యాక్టరీ’ని నడుపుతున్నారని, సోషల్ మీడియా వేదికగా తనపై తప్పుడు వార్తలను ప్రచారం చేయిస్తున్నారని మండిపడ్డారు. కొంత మంది స్వార్థ రాజకీయాలు చేస్తున్నారని, కొత్త పార్టీ పెడతానని తప్పుడు ప్రచారం చేస్తున్నారని అవన్నీ ఫేక్ ప్రచారాలని కొట్టిపారేవారు. ప్రజలకు తానేంటో, తన నిజాయితీ ఏంటో బాగా తెలుసని ఆయన స్పష్టం చేశారు.
Also read: Layoff emails: మెటా ఉద్యోగులకు బిగ్షాక్.. వర్క్ఫ్రమ్ హోమ్ పేరు చెప్పి లేఆఫ్ మెయిల్స్
తప్పు చేస్తే కన్న కొడుకును కూడా క్షమించను..
ఇక, తన కుమారుడు బండి భగీరథ్ పోక్సో కేసు, అరెస్టు వ్యవహారంపై బండి సంజయ్ స్పందిస్తూ కీలక వ్యాఖ్యలు చేశారు. తప్పు చేస్తే కన్న కొడుకునైనా సరే పోలీసులకు అప్పగించిన చరిత్ర తనదని గుర్తు చేశారు. అయితే, ప్రస్తుతం ఈ కేసు హైకోర్టు పరిధిలో ఉన్నందున, చట్టాన్ని గౌరవిస్తూ ఈ అంశంపై ఇప్పుడు ఎక్కువగా మాట్లాడలేనని బండి సంజయ్ స్పష్టం చేశారు.

