Bandi Bhagirath- Ram Chander Rao కేంద్ర మంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ సాయిపై పోక్సో కేసు రాష్ట్రంలో సంచలనం సృష్టిస్తోంది. ఈ క్రమంలో నిందితుడిపై కఠిన చర్యలు తీసుకోవాలని బీజేపీయేతర నేతలు డిమాండ్ చేస్తున్నారు. బండి సంజయ్ దీనికి నైతిక బాధ్యత వహిస్తూ ఆయన తన పదవికి రాజీనామా చేయాలంటున్నారు. ఈ క్రమంలో ఈ వ్యవహారంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు స్పందించారు. ఈ మేరకు సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు.
బండి భగీరథ కేసులో బీజేపీకి ఎలాంటి సంబంధం లేదని రాంచందర్ రావు స్పష్టం చేశారు. ఈ కేసులో చట్టం తన పని తాను చేసుకుపోతుందని వెల్లడించారు. అది బీజేపీలో జరిగిన అంశం కాదని.. బండి సంజయ్ కుటుంబంలో జరిగిన వ్యక్తిగత అంశమని పేర్కొన్నారు.
కాగా, భగీరథ సాయిపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణల నేపథ్యంలో, బండి సంజయ్ తన పదవికి తక్షణమే రాజీనామా చేయాలని బీఆర్ఎస్ నేత జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు జగిత్యాలలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన పదవి నుంచి తప్పుకోవాలని, బాధితులకు న్యాయం చేయాలని స్పష్టం చేశారు.
బండి భగీరథ్ కేసులో సీఎం రేవంత్ రెడ్డి, ప్రధాని మోదీతో కుమ్మక్కయ్యారని జీవన్ రెడ్డి ఆరోపించారు. ఈ ఘటనపై కాంగ్రెస్ పార్టీ అధికారికంగా ఖండించకపోవడం దురదృష్టకరమన్నారు. ఆడబిడ్డపై దారుణం జరిగితే కనీస స్పందన కూడా లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు.
సీఎం రేవంత్ రెడ్డి లాలూచీ పడటానికి అనేక కారణాలు ఉన్నాయని.. ఓటుకు నోటు కేసు కారణంగానే ఆయన కేంద్రానికి తలొగ్గాల్సిన పరిస్థితి వచ్చిందని విమర్శించారు. మోదీతో సాన్నిహిత్యం కారణంగా బీజేపీ నేతలపై చర్యలు లేవని ఎద్దేవా చేశారు. బండి భగీరథ్పై పోక్సో కేసులో BNS సెక్షన్ 87 కింద కిడ్నాపింగ్ కేసు కూడా నమోదు చేయాలని జీవన్ రెడ్డి డిమాండ్ చేశారు.

