SIT issues: ఫోన్ ట్యాపింగ్ కేసులో కేసీఆర్కు సిట్ నోటీసులు జారీ చేయడంపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు రాంచందర్ రావు తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య లోపాయికారీ ఒప్పందం (Quid Pro Quo) నడుస్తోందని ఆరోపించారు. గతంలో ‘ఓటుకు నోటు’ కేసులో రేవంత్ రెడ్డిని కేసీఆర్ కాపాడారని.. ఇప్పుడు దానికి ప్రతిఫలంగా కాళేశ్వరం అవినీతి, ఫోన్ ట్యాపింగ్ కేసుల్లో కేసీఆర్ను రేవంత్ రెడ్డి కాపాడుతున్నారని రాంచందర్ రావు ధ్వజమెత్తారు.
సిట్ విచారణ నిష్ప్రయోజనం: ప్రస్తుత సిట్ విచారణ వల్ల ఒరిగేదేమీ లేదని రాంచందర్ రావు అన్నారు. ఇది కేవలం కాలయాపన కోసమేనని ఆయన విమర్శించారు. బీఆర్ఎస్ అవినీతి పాలసీలనే కాంగ్రెస్ ప్రభుత్వం సైతం అమలు చేస్తోందని మండిపడ్డారు. గత పదేళ్లుగా తెలంగాణను కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు కలిసి దోచుకున్నాయని ఆరోపించారు. 2014 నుంచి ఇప్పటి వరకు రెండు ప్రభుత్వాలు తీసుకున్న నిర్ణయాలు, పాలసీలపై సమగ్ర విచారణ జరగాలని రాంచందర్ రావు డిమాండ్ చేశారు.
న్యాయ విచారణే శరణ్యం: ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, మాజీ సీఎం కేసీఆర్ మధ్య లోపాయికారీ ఒప్పందం.. తెలంగాణ ప్రజలను తప్పుతోవ పట్టిస్తున్నారని అన్నారు. ఈ కేసులో నిజాలు బయటకు రావాలంటే హైకోర్టు సిట్టింగ్ జడ్జితో న్యాయ విచారణ జరిపించాలని రాంచందర్ రావు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అప్పుడే దోషులకు అసలైన శిక్ష పడుతుందని ఆయన స్పష్టం చేశారు.

