HomeTop StoriesBRICS: నేటి నుంచి హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల అవినీతి నిరోధక సదస్సు

BRICS: నేటి నుంచి హైదరాబాద్‌లో బ్రిక్స్ దేశాల అవినీతి నిరోధక సదస్సు

BRICS: అంతర్జాతీయ సదస్సు నిర్వహణకు భాగ్యనగరం మరోసారి వేదికవుతోంది. నేటి నుంచి రెండు రోజుల పాటు ‘బ్రిక్స్ (BRICS) దేశాల అవినీతి నిరోధక కార్యాచరణ బృందం’ సదస్సు జరగనుంది. కేంద్ర సిబ్బంది, శిక్షణ మంత్రిత్వ శాఖ (DoPT) ఆధ్వర్యంలో ఈ సదస్సును నిర్వహిస్తుండగా.. డీవోపీటీ సెక్రటరీ రచనా షా ఈ సదస్సును అధికారికంగా ప్రారంభించనున్నారు.

- Advertisement -

సదస్సు ప్రధాన ఉద్దేశం: బ్రిక్స్ కూటమి దేశాల్లో అవినీతి నిరోధానికి తీసుకోవాల్సిన పటిష్టమైన చర్యలపై ఈ సమావేశంలో ప్రధానంగా చర్చిస్తారు. సభ్య దేశాలతో పాటు అంతర్జాతీయ స్థాయి అవినీతి నిరోధక నిపుణులు ఈ సదస్సుకు హాజరుకానున్నారు. జూన్ నెలలో జరిగిన సమావేశానికి కొనసాగింపుగానే (Extension) ఈ సదస్సును నిర్వహిస్తున్నట్లు డీవోపీటీ వర్గాలు వెల్లడించాయి. ముఖ్యంగా 2026 సంవత్సరానికి బ్రిక్స్ కూటమికి భారత్ అధ్యక్ష హోదాలో నిర్వహిస్తుండగా.. ఈ ఏడాది జరగబోతున్న ఆఖరి సదస్సు ఇదే కావడం విశేషం.

చర్చకు రానున్న కీలక అంశాలు: బ్రిక్స్ కూటమి దేశాల్లో అవినీతి కేసుల్లో నిందితులుగా ఉండి, చట్టం కన్నుగప్పి తప్పించుకుంటున్న నేరస్థులను గుర్తించడం మరియు వారిపై తీసుకోవాల్సిన తదుపరి చట్టపరమైన చర్యలపై కూలంకషంగా చర్చిస్తారు. దేశాల మధ్య పరస్పర సహకారాన్ని పెంపొందించుకోవడంతో పాటు అవసరమైన సాంకేతిక విభాగాల మధ్య సమన్వయాన్ని ఎలా మెరుగుపరుచుకోవాలనే దానిపై సమీక్షించనున్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో డిజిటల్ ఆస్తుల భద్రత, వాటి అక్రమ చలామణి కారణంగా పెరుగుతున్న అవినీతిని ఎలా అడ్డుకోవాలనే అంశంపై నిపుణులు తమ అనుభవాలను, సలహాలను పంచుకోనున్నారు. బ్రిక్స్ దేశాల్లోని వివిధ పరిపాలనా వ్యవస్థల్లో ఎదురైన అనుభవాలు, ఉత్తమ విధానాలను ఒకరితో ఒకరు పంచుకోనున్నట్లు డీవోపీటీ ఒక ప్రకటనలో వెల్లడించింది.

సంబంధిత వార్తలు | RELATED ARTICLES

Latest News