Buses burned in two places: తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండిపోతున్నాయి. ముఖ్యంగా హైదరాబాద్లో ఎండల తీవ్రతకు ప్రజలు బెంబేలెత్తిపోతున్నారు. ఎండల తీవ్రతకు ప్రజలు బయటికి రావాలంటేనే జంకుతున్నారు. ఎండ తీవ్రతతో బండ్లు బయటకి తీయడం లేదు. ఒకవేళ తీసినా కొన్ని చోట్ల అగ్నికి ఆహుతవుతున్నాయి. తాజాగా హైదరాబాద్ నగరంలో రెండు భారీ బస్సు ప్రమాదాలు చోటుచేసుకున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఎంజీబీఎస్ బస్టాండ్లో ఆగి ఉన్న బస్సులో మంగళవారం ఒక్కసారిగా మంటలు చెలరేగడం తీవ్ర కలకలం రేపింది. బస్టాండ్ ప్లాట్ఫామ్పై పార్క్ చేసి ఉన్న గద్వాల్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సులో అకస్మాత్తుగా మంటలు వ్యాపించాయి. బస్సులో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి.. దీంతో ప్రయాణికులు తీవ్ర భయాందోళనతో బయటికి పరుగులు తీశారు. అయితే, ప్రమాదం జరిగిన సమయంలో బస్సు ప్లాట్ఫామ్పై నిలిపి ఉంచడం, బస్సు లోపల ప్రయాణికులు ఎవరూ ఎక్కకపోవడంతో పెద్ద ప్రమాదం తప్పినట్లయింది. ఈ ఘటనలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడంతో అటు అధికారులు, ఇటు ప్రయాణికులు ఊపిరి పీల్చుకున్నారు. ఈ ప్రమాదానికి గల ఖచ్చితమైన కారణాలు ఇంకా తెలియరాలేదు. బస్సు కండిషన్, సరైన మెయింటెనెన్స్ లోపం వల్ల ఈ ప్రమాదం జరిగిందా? లేక ఎండ వేడిమి వల్ల షార్ట్ సర్క్యూట్ వంటి ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా? అనే కోణంలో రవాణా శాఖ అధికారులు పరిశీలిస్తున్నారు.
ఓఆర్ఆర్పై ప్రైవేటు బస్సు దగ్ధం..
ఇక, హైదరాబాద్ శివార్లలో మరో అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. కొహెడ సమీపంలోని ఔటర్ రింగ్ రోడ్డు సర్వీస్ రోడ్డుపై ప్రయాణిస్తున్న ఒక ప్రైవేటు బస్సులో ఆకస్మాత్తుగా మంటలు చెలరేగి, బస్సు పూర్తిగా దగ్ధమైంది. శంషాబాద్ ఎయిర్పోర్ట్ వైపు నుంచి వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. సిబ్బంది వెంటనే అప్రమత్తమై, లోపల ఉన్నవారందరినీ కిందకు దించేయడంతో తృటిలో పెను ప్రమాదం తప్పింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు.
వేసవిలో వాహనదారులు జాగ్రత్త..!
ప్రస్తుతం తీవ్రమైన ఎండల నేపథ్యంలో అధికారులు వాహనదారులకు కీలక సూచనలు చేశారు. తీవ్రమైన ఎండ వేడిమి కారణంగా వాహనాల్లోని ఇంజన్లు వేడెక్కి, వైరింగ్ దెబ్బతిని మంటలు అంటుకునే ప్రమాదం ఎక్కువగా ఉంటుందని, ప్రైవేట్, ప్రభుత్వ వాహనదారులు తమ వాహనాల ఫిట్నెస్ను, రేడియేటర్లను క్రమం తప్పకుండా తనిఖీ చేసుకోవాలని, సుదీర్ఘ ప్రయాణాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.

