CM Revanth Reddy Cabinet Meeting: ఈ నెల 23న తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ సమావేశం జరగనుంది. అసెంబ్లీ సమావేశాలు, రైతు భరోసా, జిల్లా, మండల పరిషత్ ఎన్నికలు తదితర అంశాలపై చర్చించే అవకాశం ఉన్నట్లు సమాచారం.
ఫిబ్రవరి 23న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గం సమావేశం కానుంది. సోమవారం మధ్యాహ్నం 3 గంటలకు మంత్రిమండలి సమావేశమై కీలక అంశాలపై చర్చించి నిర్ణయాలు తీసుకోనుంది. ముఖ్యంగా తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల నిర్వహణపై మంత్రివర్గం చర్చించనుంది. శాఖలవారీగా బడ్జెట్ కేటాయింపులు, కొత్త పథకాల అమలుపై నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. అదేవిధంగా జీహెచ్ఎంసీ, జడ్పీటీసీ, ఎంపీటీసీ ఎన్నికలు, రైతు భరోసా నిధులు విడుదల తదితర అంశాలపై చర్చించి నిర్ణయం తీసుకోనున్నారు.
Also Read: https://teluguprabha.net/telangana/high-court-granted-conditional-bail-to-ibomma-ravi/
కాగా, ముంబయిలో జరగనున్న పర్యావరణ సదస్సు (క్లైమేట్ వీక్) లో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొననున్నారు. ఈ రోజు రాత్రి శంషాబాద్ ఎయిర్పోర్టు నుంచి ఆయన ముంబయి బయలుదేరుతారు. ఈ కార్యక్రమంలో పర్యావరణ పరిరక్షణ, గ్రీన్ ఎనర్జీ, స్థిరమైన అభివృద్ధి వంటి అంశాలపై ఆయన ప్రసంగించనున్నారు. ముంబయి పర్యటన అనంతరం ఆయన ఢిల్లీకి బయలుదేరనున్నారు. ఈ నెల 19న ఉదయం 10 గంటలకు దేశ రాజధాని ఢిల్లీలో ఏఐసీసీ ప్రధాన కార్యాలయం ఇందిరా భవన్ వేదికగా భారీ సమావేశం జరగనుంది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంతో రాష్ట్ర కేబినేట్ హస్తినకు వెళ్లనున్నారు. ఈ నేపథ్యంలో అధిష్ఠానం ఏం నిర్ణయాలు తీసుకోబోతుందనేది ఆసక్తికరంగా మారింది.

