CM appeals to Hudco Chairman to Give loans at low interest rates: తెలంగాణ ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి పనులకు, ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు తక్కువ వడ్డీకే రుణాలు ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి హడ్కో ఛైర్మన్ సంజయ్ కులశ్రేష్ఠను కోరారు. హైదరాబాద్లో సీఎం రేవంత్ రెడ్డితో కులశ్రేష్ఠ సోమవారం భేటీ అయ్యారు. ఈ సందర్భంగా తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న భారత్ ఫ్యూచర్ సిటీ, హైదరాబాద్ మెట్రో విస్తరణ, ఆర్ఆర్ఆర్, రేడియల్ రోడ్ల నిర్మాణం వంటి ప్రతిష్టాత్మక ప్రాజెక్టులకు తక్కువ వడ్డీ రేటుతో రుణాలు ఇవ్వాలని సీఎం హడ్కో ఛైర్మన్కు విజ్ఞప్తి చేశారు. భారత్ ఫ్యూచర్ సిటీ నుంచి బెంగళూర్, అమరావతి మీదుగా చెన్నై వరకు గ్రీన్ ఫీల్డ్ రహదారులు, బందరు పోర్ట్ వరకు నిర్మించనున్న గ్రీన్ఫీల్డ్ రహదారి, బుల్లెట్ ట్రైన్ నిర్మాణాలపై హడ్కో ఛైర్మన్తో చర్చించారు. గతంలో అత్యధిక వడ్డీ రేటుతో ఇచ్చిన రుణాలకు సంబంధించి రుణ పునర్వ్యవ్యస్థీకరణ (లోన్ రీకన్స్ట్రక్చన్) అంశాన్ని సీఎం హడ్కో ఛైర్మన్ దృష్టికి తీసుకొచ్చారు.
Also Read: https://teluguprabha.net/cinema-news/samantha-secret-marriage-raj-nidimoru/
సానుకూల వృద్ధి రేటుతో సాగుతున్న తెలంగాణ..
అయితే, ఈ అంశంపై హడ్కో ఛైర్మన్ సానుకూలంగా స్పందించారు. సానుకూల వృద్ది రేటుతో ఉన్న తెలంగాణలో ప్రాజెక్టులకు తక్కువ వడ్డీరేటుతో దీర్ఘ కాలిక రుణాలు ఇవ్వాలని సీఎం వారిని కోరారు. మరో 10 లక్షల ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించి రుణాలు వేగంగా మంజూరు చేయాలని సీఎం కోరగా ఛైర్మన్ కులశ్రేష్ఠ సానుకూలంగా స్పందించారు. ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఇప్పటికే రుణాలు మంజూరు చేశామని సీఎంకు గుర్తు చేశారు. ఈ నెల 8, 9వ తేదీల్లో భారత్ ఫ్యూచర్ సిటీలో నిర్వహించనున్న భారత్ గ్లోబల్ సమ్మిట్కు హాజరుకావాలని హడ్కో ఛైర్మన్ను సీఎం ఆహ్వానించారు. సమావేశంలో రాష్ట్ర రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి, రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు, సీఎం ముఖ్య కార్యదర్శి కే.ఎస్.శ్రీనివాసరాజు, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి సందీప్ కుమార్ సుల్తానియా, రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి వికాస్ రాజ్, గృహ నిర్మాణ శాఖ ఎండీ గౌతమ్, హడ్కో రీజినల్ చీఫ్ పి.సుభాష్ రెడ్డి, హడ్కో జాయింట్ జనరల్ మేనేజర్లు ఆశీష్ గుండాల, సయ్యద్ రహీముద్దీన్ తదితరులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.

