CM Revanth Comments on Future City: ఫ్యూచర్ సిటీ కేవలం మన కోసం మాత్రమే కాదు.. మొత్తం ప్రపంచానికని తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి పేర్కొన్నారు. ఫ్యూచర్సిటీ డెవలప్మెంట్ అథారిటీ కార్యాలయాన్ని ప్రారంభించిన అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో పాల్గొని మాట్లాడారు. 150 రోజుల్లోనే ఈ కార్యాలయ నిర్మాణం పూర్తి చేశామని, వచ్చే ఎనిమిదేళ్లలో న్యూయార్క్, టోక్యో, సింగపూర్తో పోటీపడేలా ఫ్యూచర్ సిటీని రూపొందిస్తామని తెలిపారు. 2034 నాటికి ట్రిలియన్ డాలర్ ఎకానమీకి ఫ్యూచర్ సిటీ చేరుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. ఇంకా ఆయన మాట్లాడుతూ ‘‘హైదరాబాద్ నగరాన్ని విస్తరించడం వల్లే ప్రపంచపటంలో దీనికి ప్రత్యేక స్థానం లభించింది. బంగారం ధర కంటే రంగారెడ్డి భూముల ధరలే ఎక్కువగా ఉన్నాయి. ఆనాటి నిజాంలు, కులీకుతుబ్ షా హైదరాబాద్ నగరాన్ని అనేకసార్లు విస్తరించారు. హైటెక్సిటీ, ఓఆర్ఆర్, జీనోమ్ వ్యాలీని అడ్డుకోవాలని చాలా మంది కుట్రలు చేశారు. నగరాన్ని విస్తరించకపోతే 10 లక్షల మంది ఐటీ నిపుణులకు ఉద్యోగాలు లభించేవా? ఫ్యూచర్ సిటీని అడ్డుకునేందుకు బీఆర్ఎస్ నాయకులు అనేక కుట్రలు చేస్తున్నారు. బీఆర్ఎస్ రద్దయిన నోటు. ఆ పార్టీని ఇప్పటికే ప్రజలు తిరస్కరించారు. ఇలాగే ప్రవర్తిస్తే వచ్చేసారి ప్రతిపక్ష హోదా కూడా దక్కదని గుర్తించుకోవాలి.
Also read: CM Chandrababu: అమరావతిలో కీలక ప్రాజెక్టుకు కేంద్రం గ్రీన్ సిగ్నల్.. సీఎం చంద్రబాబు కృతజ్ఞతలు
బీఆర్ఎస్ హయాంలో యథేశ్చగా చెరువులు ఆక్రమణ..
నిన్న పడిన కొద్దిపాటి వర్షానికే హైదరాబాద్ రోడ్లు మొత్తం వరద నీటితో నిండిపోయాయి. రోడ్లపై వరద పారుతుంటే ప్రభుత్వాన్ని నిందించడం సహజం. అయితే, దీనికి కారణమెవరో ప్రజలు గ్రహించాలి. బీఆర్ఎస్ హయాంలో జరిగిన ఆక్రమణల వల్ల చెరువుల్లోకి వెళ్లాల్సిన నీరు రోడ్లపైకి వస్తోంది. అంబర్పేటలో ఉన్న బతుకమ్మకుంటను ఎడ్ల సుధాకర్ రెడ్డికి కేసీఆర్ రాసిచ్చారు. బీఆర్ఎస్ నాయకులు ప్రభుత్వ భూముల్ని ఎక్కడ పడితే అక్కడ ఆక్రమించారు. అందుకే, హైడ్రాతో అక్రమ కట్టడాలను తొలగిస్తున్నాం. చెరువులను పునరుద్ధరిస్తున్నాం. లేక్ ఎకానమీ సృష్టించడానికి కాంగ్రెస్ ప్రభుత్వం అన్ని ప్రయత్నాలు చేస్తోంది. గ్లోబల్ సమ్మిట్ ద్వారా ప్రపంచదేశాలను ఇక్కడికి రప్పించాం. డిసెంబర్లోనూ గ్లోబల్ సమ్మిట్ నిర్వహిస్తాం.’’ అని సీఎం రేవంత్ రెడ్డి స్పష్టం చేశారు.

