CM Revanth Reddy: మున్సిపల్ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్ర వ్యాప్తంగా రాజకీయ వాతావరణం వేడెక్కింది. 116 మున్సిపాలిటీలు, 7 కార్పొరేషన్లలో నామినేషన్ల ఉపసంహరణకు నేటితో గడువు ముగియనుండటంతో.. బుధవారం (ఫిబ్రవరి 4) నుంచి ప్రధాన పార్టీలు ప్రచార హోరును ప్రారంభించనున్నాయి. అధికార పార్టీ కాంగ్రెస్ ఈ ఎన్నికలను అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. అమెరికా పర్యటన ముగించుకుని వచ్చిన సీఎం రేవంత్ రెడ్డి.. ఇప్పటికే పార్టీ శ్రేణులతో రెండుసార్లు జూమ్ సమావేశాలు నిర్వహించి దిశానిర్దేశం చేశారు.
రేపటి నుంచి సీఎం జిల్లాల పర్యటన: ఫిబ్రవరి 4 నుంచి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జిల్లాల పర్యటనకు శ్రీకారం చుట్టనున్నారు. నల్లగొండ జిల్లా మిర్యాలగూడ నుంచి తన ఎన్నికల ప్రచార సభలను ప్రారంభించనున్నారు.
సీఎం జిల్లాల పర్యటన వివరాలు:
- ఫిబ్రవరి 4: మిర్యాలగూడ
- ఫిబ్రవరి 5: చొప్పదండి
- ఫిబ్రవరి 6: నిజామాబాద్ రూరల్
- ఫిబ్రవరి 7: పరిగి
- ఫిబ్రవరి 8: భూపాలపల్లి
- ఫిబ్రవరి 9: మెదక్
రెబల్స్కు బుజ్జగింపులు: పార్టీలో అసంతృప్తి జ్వాలలు చల్లార్చడంపై సీఎం ప్రత్యేక దృష్టి సారించారు. రెబల్ అభ్యర్థులను బుజ్జగించి.. వారందరినీ పార్టీ గెలుపు కోసం పని చేసేలా చూడాలని స్థానిక నేతలకు సూచించారు. పార్టీ కోసం త్యాగం చేసిన వారికి, అసంతృప్తితో ఉన్న నేతలకు భవిష్యత్తులో పదవుల భర్తీలో తగిన ప్రాధాన్యత ఇస్తామని భరోసా కల్పించాలని ముఖ్యనేతలను ఆదేశించారు. ముఖ్యంగా ఉత్తర తెలంగాణలో బీజేపీ ప్రభావం ఉండే అవకాశం ఉన్నందున.. అక్కడ ధీటైన రాజకీయ వ్యూహాలతో ముందుకెళ్లాలని స్పష్టం చేశారు.
Also read-Municipal elections: అభ్యర్థుల్లో “బీ-ఫామ్” టెన్షన్.. నేతల ఆచితూచి అడుగులు!
నేడు బీ-ఫామ్ల పంపిణీ: అభ్యర్థుల ఎంపిక కోసం 15 పార్లమెంటరీ నియోజకవర్గాలకు మంత్రుల నేతృత్వంలో స్క్రీనింగ్ కమిటీలను ఏర్పాటు చేశారు. క్షేత్రస్థాయి సర్వేలు, స్థానిక సమీకరణాల ఆధారంగా కమిటీలు రూపొందించిన జాబితాకు టీపీసీసీ ఎన్నికల కమిటీ సోమవారమే ఆమోదముద్ర వేసింది. టీపీసీసీ అధ్యక్షుడు మహేష్ కుమార్ గౌడ్ ఇప్పటికే జిల్లా అధ్యక్షులు, పార్లమెంటరీ ఇంచార్జీలతో ఎప్పటికప్పుడు సమీక్షలు నిర్వహిస్తూ క్యాడర్లో ఉత్సాహం నింపుతున్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన అజెండాగా ప్రజల్లోకి వెళ్లాలని పార్టీ నిర్ణయించింది.

