CM Revanth Revanth Reddy on Keralam Results: కేరళం ఎన్నికల ఫలితాల్లో కాంగ్రెస్ నేతృత్వంలోని యూడీఎఫ్ ఘన విజయంపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హర్షం వ్యక్తం చేశారు. ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, పార్టీ అగ్రనేతలు, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీలకు అభినందనలు తెలిపారు.
కేరళంలో ఈ రోజు వెలువడిన అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో యూడీఎఫ్ కూటమి 102 స్థానాలను కైవసం చేసుకోవడంపై సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. ఈ సందర్భంగా UDF మద్దతుదారులకు, కేరళం ప్రజలకు ధన్యవాదాలు తెలియజేశారు. తెలంగాణ ప్రజానీకం తరుపున ఎల్లప్పుడు కృతజ్ఞుడనై ఉంటానని వెల్లడించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అద్భుతమైన భవిష్యత్ వైపు సాగుతున్నామని వ్యాఖ్యానించారు. ఇక కేరళలో ప్రతిపక్షం ఎల్డీఎఫ్ 35 స్థానాల్లో గెలుపొందగా.. ఎన్డీఏ కూటమి 3 స్థానాల్లో విజయం సాధించింది.
మరోవైపు వెస్ట్ బెంగాల్లో టీఎంసీ ఓటమిపై కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ప్రధాని మోదీ నేతృత్వంలోని ఎన్డీఏ కూటమి ఘన విజయం సాధించడంపై హర్షం వ్యక్తం చేశారు. గత పదేళ్లలో బెంగాల్లో దీదీ ప్రభుత్వం చేయని అరాచకం లేదని ఆరోపించారు. డబుల్ ఇంజన్ సర్కార్గా బెంగాల్లో బీజేపీ అధికారంలోకి రావడం హర్షణీయమన్నారు. టీఎంసీ అరాచకాలు, గుండాగిరి, వ్యవస్థలను నాశనం చేయడంపై జనం విసిగిపోయారని పేర్కొన్నారు. దీదీ సర్కారు ఇల్లీగల్ కోల్ మైనింగ్ చేసి వేలాది కోట్లు వెనకేసుకుందని.. కోల్ బెల్ట్తో బీజేపీ గెలుపు టీఎంసీకి చెంపపెట్టు అని కిషన్ రెడ్డి విమర్శించారు.

